1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By వరుణ్
Last Updated : శుక్రవారం, 5 మే 2023 (09:06 IST)

అగ్రహారం పాయె.. ఫాతిమా నగర్ ప్రత్యక్షమాయె... గుంటూరులో వీధి పేరు మార్పు..

fathimangar name plate
గుంటూరు నగర పాలక సంస్థ మరో వివాదాస్పద నిర్ణయం తీసుకుంది. అగ్రహారం వీధి పేరును మార్చేసి, ఫాతిమా నగర్ అని పేరు పెట్టింది. ఇది వివాదాస్పదమైంది. గుంటూరు నగరానికి కొత్తగా వచ్చిన వారు వీధులను సులభంగా గుర్తించేలా సూచిక బోర్డులను ఏర్పాటు చేస్తున్నారు. ఈ క్రమంలో ఏటీ అగ్రహారం 2వ లైన్‌‌కు పేరు మార్చి ఫాతిమా నగర్‌ పేరుతో సూచిక బోర్డు ఏర్పాటు చేయడం వివాదంగా మారింది. 
 
వైకాపా ప్రభుత్వం ఒక మతానికి అనుకూలంగా వ్యవహరిస్తుందన్న విమర్శలు వచ్చాయి. దీంతో నగరపాలక కమిషనర్‌ కీర్తి చేకూరి స్పందించారు. కింది స్థాయిలో జరిగిన పొరపాటు వల్ల పక్కనున్న ఫాతిమా నగర్‌ వీధి పేరుతో ఏటీ అగ్రహారంలో సూచిక బోర్డు ఏర్పాటు చేశారని తెలిపారు. దీనిపై పురపాలక శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్‌ స్పందిస్తూ.. పేరు మార్పు ప్రచారంలో వాస్తవం లేదన్నారు. గుత్తేదారు అవగాహన లేమితోనే పొరపాటున బోర్డు పెట్టారని.. విషయం తెలియగానే వెంటనే దాన్ని తొలగించామని వివరణ ఇచ్చారు.
 
అయితే, బీజేపీ నేతలు మాత్రం దీనిపై తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు. రాత్రికి రాత్రి గుంటూరులోని అగ్రహారం అనే ప్రాంతం పేరును మార్చేసి ఫాతిమా పేరుతో బోర్డును పెట్టడంలో అంతర్యమేమిటని భాజపా రాష్ట్ర శాఖ అధ్యక్షుడు సోము వీర్రాజు మండిపడ్డారు. హిందువుల మనోభావాలను దెబ్బతీసేలా వైకాపా ప్రభుత్వం వ్యవహరిస్తోందని విమర్శించారు. ఈ మేరకు గురువారం ఓ ప్రకటన జారీచేశారు. 
 
గతంలో కూడా విశాఖ నగరంలో సీతమ్మకొండ పేరు మార్చడం, ప్రొద్దుటూరులో టిప్పు సుల్తాన్‌ విగ్రహం పెట్టాలనుకోవడం వంటి ప్రయత్నాల వెనుక ఎవరున్నారని ప్రశ్నించారు. హిందువులపై దాడులకు తెగబడే విధంగా వైసీపీ వ్యవహరిస్తుండడం దారుణమని ఆయన ఆగ్రహం వ్యక్తంచేశారు.