శనివారం, 20 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By వి
Last Modified: గురువారం, 10 సెప్టెంబరు 2020 (17:46 IST)

ప్రైవేట్ టీచర్లకు జీతాలివ్వని స్కూళ్లపై కఠిన చర్యలు, ఏపీ సర్కార్ ఆదేశాలు

కరోనావైరస్ మహమ్మారి ప్రభావం ఏపీ లోని ప్రైవేట్ ఉపాధ్యాయుల జీవితాన్ని కనుమరుగున పడేసింది. కరోనా ప్రభావం వల్ల అనేక పాఠశాలలు మూతబడ్డాయి. ఆ తర్వాత అన్‌లాక్ ప్రక్రియ మొదలైన తర్వాత ఆన్లైన్ పాఠాలు కొనసాగుతున్నాయి. అయినా మార్చి నెల నుంచి టీచర్లకు జీతమివ్వకుండా వారి సేవలను మాత్రం వాడుకుంటున్నాయి. దీంతో టీచర్లు రోడ్డున పడుతున్నారు.
 
దీనిపై సర్వత్రా వెల్లువెత్తడంతో ప్రభుత్వం స్పందించింది. ఏపీలో టీచర్లకు జీతాలు ఇవ్వకుండా కాలయాపన చేస్తున్న ప్రైవేటు స్కూళ్లపై చర్యలు తీసుకోవాలని కోరుతూ జిల్లా విద్యాశాఖ అధికారులకు ఆదేశాలు జారీచేసింది. టీచర్లకు జీతాలు ఇవ్వని పాఠశాలలకు నోటీసులు జారీ చేయాలని తెలిపింది. దీంతో పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ వాడ్రేపు చిన వీరభద్రుడు ఉత్తర్వులు జారీచేశారు.
 
లాక్‌డౌన్ విధించినప్పటి నుండి ఇప్పటి వరకు ప్రైవేటు పాఠశాలల యాజమాన్యాలు జీతాలు చెల్లించలేదని వాటిలో విధులు నిర్వహిస్తున్న ఉపాధ్యాయులు ఆవేదన వ్యక్తం చేస్తూ ప్రభుత్వానికి ఫిర్యాదు చేశారు. ఉపాద్యాయులకు జీతాలు ఇప్పించే బాధ్యత డీఈవోలు తీసుకోవాలని విద్యాశాఖ అధికారులు ఆదేశాలు జారీ చేశారు. టీచర్లకు జీతాలు ఇవ్వని ప్రైవేటు స్కూలు యాజమాన్యానికి నోటీసులు జారీచేసి కఠిన చర్యలు తీసుకోవాలని ఉత్తర్వులో పేర్కొంది.