శుక్రవారం, 26 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : శుక్రవారం, 2 ఏప్రియల్ 2021 (17:59 IST)

జడ్పీటీసీ - ఎంపీటీసీ ఎన్నికలను బహిష్కరించిన టీడీపీ

ఏపీలో జడ్పీటీసీ - ఎంపీటీసీ ఎన్నికలను ప్రధాన ప్రతిక్షమైన తెలుగుదేశం పార్టీ బహిష్కరించింది. రాష్ట్ర ఎన్నికల సంఘం తీసుకున్న నిర్ణయాన్ని తప్పుబడుతూ ఎన్నికలు బహిష్కరిస్తున్నామని టీడీపీ అధినేత చంద్రబాబు ప్రకటించారు. పొలిట్‌బ్యూరో నిర్ణయం మేరకు ఎన్నికలను బహిష్కరిస్తున్నట్లు ఆయన శుక్రవారం ప్రకటించారు. 
 
ఎన్నికల బహిష్కరణ కఠిన నిర్ణయమే అయినా తప్పడం లేదని వ్యాఖ్యానించారు. ఎన్నికలంటే టీడీపీకి భయంలేదన్నారు. ప్రజా కోర్టులో అధికార పార్టీని దోషిగా నిలబెడతామని చంద్రబాబు హెచ్చరించారు. బలవంతపు, అక్రమ ఏకగ్రీవాలపై చర్యలు తీసుకోకపోడాన్ని ఆయన తప్పుబట్టారు. 
 
జాతీయ స్థాయిలోనూ పోరాటం కొనసాగిస్తామని తెలిపారు. అక్రమాలు జరిగిన ఎన్నికలను కొనసాగిస్తున్నారని దుయ్యబట్టారు. గతంలో కరోనా కారణంగా ఎన్నికలు వద్దని మాజీ ఎస్‌ఈసీ నిమ్మగడ్డ రమేష్‌కుమార్ చెబితే తప్పుపట్టారని, ఇప్పుడు కరోనా సెకండ్‌ వేవ్‌ ఉందని, ఎన్నికలు ఎలా పెడతారు? అని ప్రశ్నించారు. 
 
కొత్త నోటిఫికేషన్‌ ఇస్తే పోటీకి తాము సిద్ధంగా ఉన్నామని చంద్రబాబు ప్రకటించారు. ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలను బహిష్కరించాలని ప్రధాన ప్రతిపక్షం టీడీపీ ముందు నుంచే యోచిస్తోంది. దీనిపై శుక్రవారం ఆ పార్టీ అత్యవసరంగా పొలిట్‌బ్యూరో, రాష్ట్ర జనరల్‌ బాడీ సమావేశాలను ఏర్పాటు చేసి, ఇందులో అన్ని అంశాలపై చర్చించి తుది నిర్ణయం తీసుకుంది.