శనివారం, 20 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By pnr
Last Updated : గురువారం, 1 ఫిబ్రవరి 2018 (16:40 IST)

బడ్జెట్టూ లేదూ వంకాయ లేదు.. పోవయ్యా ఫో.. : జేసీ దివాకర్ రెడ్డి

కేంద్ర ఆర్థికమంత్రి అరుణ్ జైట్లీ గురువారం ప్రవేశపెట్టిన వార్షిక బడ్జెట్‌పై తెలుగుదేశం పార్టీకి చెందిన అనంతపురం ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి తనదైనశైలిలో కామెంట్స్ చేశారు.

కేంద్ర ఆర్థికమంత్రి అరుణ్ జైట్లీ గురువారం ప్రవేశపెట్టిన వార్షిక బడ్జెట్‌పై తెలుగుదేశం పార్టీకి చెందిన అనంతపురం ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి తనదైనశైలిలో కామెంట్స్ చేశారు. బడ్జెట్‌పై మీ స్పందనేంటని ఢిల్లీలో ఓ విలేకరి అడిగిన ప్రశ్నకు ఆయన సమాధానమిస్తూ.. బడ్జెట్టూ లేదూ వంకాయ లేదు.. పోవయ్యా ఫో.. అంటూ వ్యాఖ్యానించారు. 
 
ఆ తర్వాత రైల్వే జోన్‌పై మీ కామెంట్ ఏంటని ప్రశ్నించగా.. రైల్వే జోన్ సంగతి ఏమో తెలియదుకానీ, తాడిపత్రికి విమాన జోన్ మాత్రం వస్తుందని ఆయన వ్యంగ్యంగా ఉన్నారు. ఎందుకంటే దేశంలో ద్వితీయ శ్రేణి నగరాల్లో ఉన్న విమానాశ్రయాల్లో అభివృద్ధిలో భాగంగా తాడిపత్రిలో విమాన జోన్ ఏర్పాటు చేసి అన్ని విమానాలు దిగేలా చేస్తారంటూ సెటైర్లు వేశారు. 
 
తమను పొమ్మన లేక పొగ పెడుతున్నట్లు కేంద్ర ప్రభుత్వ తీరు ఉందన్నారు. టీడీపీ మాత్రమే కాదని దేశంలోని అన్ని పార్టీలకు ఈ బడ్జెట్‌పై నిరాశ, నిస్పృహ ఉందన్నారు. ఏపీకి ఎటువంటి ప్రత్యేక నిధులు ఇవ్వడం లేదని, అతి తక్కువగా నిధులు ఇచ్చి సాయం చేశామన్నామంటే ఎలా అని ప్రశ్నించారు. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుకి చాలా సహనం ఉందని ఆయన ఎంతో ఓపికగా ఉన్నారని వ్యాఖ్యానించారు. 
 
చివరకు పార్లమెంటు సాక్షిగా ఆంధ్రప్రదేశ్‌కి ఇచ్చిన హామీలపై, తిరుపతి వేంకటేశ్వర స్వామి సాక్షిగా ఇచ్చిన హామీలపై కూడా కేంద్ర బడ్జెట్‌లో న్యాయం చేయలేదని జేసీ దివాకర్ రెడ్డి వాపోయారు. అలాగే, అధికార టీడీపీ ఎంపీలంతా తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేయగా, చిత్తూరు ఎంపీ శివప్రసాద్ మాత్రం తనదైనశైలిలో మౌనం వహించి నిరసన తెలిపారు. 
 
అలాగే, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత టి.సుబ్బిరామిరెడ్డి స్పందిస్తూ అరుణ్ జైట్లీ లోక్‌సభలో ప్రవేశపెట్టి బడ్జెట్ తీవ్ర నిరాశను మిగిల్చిందన్నారు. బడ్జెట్‌లో ఏపీ ప్రస్తావన, పునర్విభజన చట్టంలోని అంశాలను ప్రస్థావించకపోవటం అన్యాయమని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రత్యేకంగా చెప్పుకోవటానికి ఏమీలేని బడ్జెట్లో మిగిలేది అసంతృప్తేనని సుబ్బరామిరెడ్డి అన్నారు.