శుక్రవారం, 19 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. బిజినెస్
  3. బడ్జెట్ 2018-19
Written By pnr
Last Updated : గురువారం, 1 ఫిబ్రవరి 2018 (09:13 IST)

#Budget2018 : అరుణ్ జైట్లీ చిట్టా పద్దులో వేతనజీవికి ఊరట!

కోటానుకోట్ల మంది దేశ ప్రజల ఆశల పద్దుకు సమయం ఆసన్నమైంది. మరికొన్ని గంటల్లో 2018-19 వార్షిక బడ్జెట్‌ను ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ ప్రవేశపెట్టనున్నారు. పాత సంప్రదాయానికి చరమగీతం పాడుతూ, కొత్త ఆనవాయితీకి

కోటానుకోట్ల మంది దేశ ప్రజల ఆశల పద్దుకు సమయం ఆసన్నమైంది. మరికొన్ని గంటల్లో 2018-19 వార్షిక బడ్జెట్‌ను ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ ప్రవేశపెట్టనున్నారు. పాత సంప్రదాయానికి చరమగీతం పాడుతూ, కొత్త ఆనవాయితీకి తెరదీస్తూ గురువారం ఉదయం ఉదయం 11 గంటల సమయంలో లోక్‌సభలో బడ్జెట్ ప్రసంగాన్ని జైట్లీ ప్రారంభించనున్నారు. ఈ బడ్జెట్‌పై దేశ ప్రజలు ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. ఎవరికి వరాలు లభిస్తాయి? ఎవరిపై వడ్డింపులు ఉంటాయన్న విషయమై అందరిలోనూ ఆసక్తి నెలకొని ఉంది. 
 
ఈనేపథ్యంలో ఢిల్లీలోని ఆర్థిక శాఖ వర్గాల సమాచారం మేరకు.. వ్యక్తిగత పన్ను చెల్లింపుదారులపై ఉన్న భారాన్ని కొంతమేరకు తగ్గిస్తూ, ఆదాయపు పన్ను శ్లాబ్స్ స్వల్పంగా మారే అవకాశాలు ఉన్నాయని అధికారులు చెబుతున్నారు. అలాగే, దేశ రైతాంగాన్ని ఆదుకునేందుకు వీలుగా ఆయన పలు ఉద్దీపన ప్యాకేజీలు ప్రకటించనున్నారట. ముఖ్యంగా, ఆర్థిక వ్యవస్థ మెరుగుతో పాటు రైతుల సంక్షేమానికి, వ్యవసాయ రంగానికి పెద్ద పీట వేస్తూ, ఈ బడ్జెట్‌లో గిట్టుబాటు ధర, పంటల బీమా తదితరాలపై కీలక ప్రకటనలు వెలువడనున్నాయి. 
 
అలాగే, వచ్చే సంవత్సరంలో ద్రవ్యలోటు లక్ష్యాన్ని మరింతగా తగ్గించడమే లక్ష్యమంటూ పార్లమెంట్ ముందుకు వచ్చిన ఆర్థిక సర్వే స్పష్టం చేసిన నేపథ్యంలో, జైట్లీ వెలువరించే నిర్ణయాలపైనా ఆసక్తి నెలకొంది. ఇక గత నాలుగేళ్లలో వృద్ధి రేటు గణనీయంగా తగ్గడం, అది కూడా ఎన్డీయే అధికారంలోకి వచ్చిన తర్వాతనే అంటూ విపక్షాలు విమర్శిస్తుండటంతో, వృద్ధి రేటు పెంపు లక్ష్యంగా జైట్లీ పలు కీలక ప్రతిపాదనలను తీసుకు రానున్నారని అధికార వర్గాలు అంటున్నాయి. 
 
జాతీయ రహదారులు, రైల్వేల ఆధునికీకరణ తదితరాల నిమిత్తం గత సంవత్సరం బడ్జెట్ లో 3.96 లక్షల కోట్లను కేటాయించిన జైట్లీ, ఈ సంవత్సరం దాన్ని మరింత పెంచే అవకాశాలు ఉన్నట్టు సమాచారం. కార్పొరేట్ టాక్స్‌ను ప్రస్తుతమున్న 30 శాతం నుంచి 25 శాతానికి తగ్గించడం వంటి కొన్ని మార్కెట్ వర్గాలకు అనుకూల నిర్ణయాలు కూడా ఉంటాయని సమాచారం. మొత్తంమీద జైట్లీ బడ్జెట్ కోసం ప్రతి ఒక్కరూ ఆశగా ఎదురు చూస్తున్నారు.