1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By జెఎస్కే
Last Modified: విజ‌య‌వాడ‌ , బుధవారం, 29 డిశెంబరు 2021 (12:29 IST)

గ‌న్ మెన్లు వ‌ద్ద‌న్న వంగ‌వీటి... భద్రతలో అశ్రద్ద వద్దన్న చంద్ర‌బాబు

ఏపీలో రాజ‌కీయ ఎత్తుగ‌డ‌లు చ‌క‌చ‌కా జ‌రిగిపోతున్నాయి. తెలుగుదేశం నాయ‌కుడు, మాజీ ఎమ్మెల్యే వంగ‌వీటి రాధాకు గ‌న్ మెన్ల‌ను టూ ప్ల‌స్ టూ రాష్ట్ర ప్ర‌భుత్వం ఏర్పాటు చేసింది. కానీ, వంగ‌వీటి ఇంటికి వెళ్ళిన భ‌ద్ర‌త సిబ్బందిని రాధా వెన‌క్కి పంపారు. త‌న‌కు గ‌న్ మెన్లు అవ‌స‌రం లేద‌ని స్ప‌ష్టం చేశారు. అయితే, దీనికి టీడీపీ అధినేత చంద్ర‌బాబు అడ్డు చెప్పారు. రాధా భ‌ద్ర‌త చాలా ముఖ్య‌మని పేర్కొన్నారు.
 
 
తనకు గన్‌మెన్లు వద్దన్నమాట వాస్తవమేనని మాజీ ఎమ్మెల్యే, తెదేపా నేత వంగవీటి రాధా స్పష్టం చేశారు.  ఆయన మీడియాతో మాట్లాడుతూ, నిత్యం ప్రజల్లో ఉండే వ్యక్తిని అందుకే గన్‌ మెన్లు వద్దన్నా అని వివరించారు. తన క్షేమంపై అన్ని పార్టీల నేతలు ఫోన్‌ చేసి అడిగారని చెప్పారు.
 
 
తనను చంపేందుకు కొందరు రెక్కీ నిర్వహించారంటూ రాధా సంచలన వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో మంత్రి కొడాలి నాని సీఎం జగన్‌ను కలిసి ఈ విషయాన్ని ఆయన దృష్టికి తీసుకెళ్లారు. అనంతరం నాని మీడియాతో మాట్లాడుతూ, రాధాకు 2 ప్లస్‌ 2 గన్‌మెన్లు ఇవ్వాలని సీఎం ఆదేశించారని వెల్లడించారు. వెంటనే భద్రత కల్పించాలని ఇంటెలిజెన్స్‌ డీజీకి ఆదేశించారన్నారు. రాధాపై ఎవరు రెక్కీ చేశారో దర్యాప్తు జరపాలని ఆదేశించారని తెలిపారు.
 
 
ఇదే క్ర‌మంలో ఇపుడు టీడీపీ అధినేత చంద్ర‌బాబు రంగంలోకి దిగారు. వంగవీటి రాధాకు చంద్రబాబు ఫోన్ చేసి మాట్టాడారు. రాధాపై రెక్కీ వ్యవహారంపై ఆరా తీశారు. గన్ మెన్లను తిరస్కరించడం సరి కాద‌ని, తగు జాగ్రత్తలు తీసుకోవాలని రాధాకు సూచనలు చేశారు. భద్రత విషయంలో అశ్రద్ద వద్దని, రాధాకు పార్టీ పూర్తి అండగా నిలుస్తుందని భరోసా ఇచ్చారు. కుట్ర రాజకీయాలపై పార్టీపరంగా పోరాడదాం అని వంగ‌వీటి రాధాకు చంద్ర‌బాబు చెప్పారు.