గురువారం, 28 మార్చి 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎం
Last Updated : శుక్రవారం, 25 సెప్టెంబరు 2020 (22:00 IST)

సమాజంలో చిట్టచివరి వ్యక్తికీ సంక్షేమ ఫలాలు అందాలి: భాజ‌పా

సమాజంలో చిట్టచివరి వ్యక్తికి కూడా సంక్షేమ ఫలాలు లభించి ఆర్థికంగా ఎదగాలని మానవతా సిద్ధాంతం ద్వారా చెప్పిన మహనీయుడు దీన్ దయాళ్ ఉపాధ్యాయ అని భాజపా జాతీయ కార్యదర్శి వై.సత్యకుమార్ పేర్కొన్నారు.

పండిట్ దీర్ఘయాళ్ ఉపాధ్యాయగా 105వ జయంతి సందర్భంగా దీన్ దయాల్ శ్రవణ ఫౌండేషన్ ఆధ్వర్యంలో విజ‌య‌వాడ మొగల్రాజపురంలోని సిద్ధార్థ అకాడమి ఆడిటోరియంలో 100 మందికి ఉచిత వినికిడి మిషన్లు అందచేసే కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ముందుగా దీన్ దయాళ్ ఉపాధ్యాయ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు.

అనంతరం ఆయన మాట్లాడుతూ, మహోన్నత వ్యక్తిత్వం కలిగిన వ్యక్తి దీన్ దయాళ్ ఉపాధ్యాగా తెలిపారు. నమ్మిన సిద్ధాంతాన్ని అచరించి చూపిన గొప్ప నాయకుడు దీన్ దయాళ్ అన్నారు. పేదరికంలో మగ్గుతున్న వారికి ఆర్ధిక స్వాతంత్ర్యం ఎంతో అవసరమని, సమాజంలో అణగారిన వర్గాల అభ్యున్నతి కోసం ఆయన ప్రత్యేకంగా పనిచేసి ఆదర్శంగా నిలిచారన్నారు.

నేడు భాజపా ఆయన చూపిన మార్గంలో నడుస్తూ.. ఆచరిస్తుందన్నారు. కరోనా కష్ట కాలంలో మోడీ అనేక చర్యలు తీసుకున్నా... పార్టీ నాయకులు, కార్యకర్తలు పార్టీ తరపున కోట్ల మందికి సేవలు అందించారన్నారు. నిత్యావసర వస్తువులు అందించి పేదల కడుపు నింపారన్నారు. ఆ స్ఫూర్తితోనే అవసరమైన వారికి వినికిడి మిషన్లు, వికలాంగులకు ఇతర పరికరాలు అందిస్తున్నట్లు చెప్పారు.

రాష్ట్రంలో పరిస్థితి అగమ్యగోచరంగా మారిందని, సిఎం ఎప్పుడూ కనిపించరు.. వినిపించరని, హఠాత్తుగా మీడియా ముందుకు వచ్చి ఒక పధకం ప్రకటించి మాయమైపోతారని విమర్శించారు. గతంలో ఇచ్చిన హామీలు, ప్రజా సమస్యలు, ఇసుక, మద్యం మాఫియా పై ఆయన ఏ మాత్రం స్పందించడం లేదని అన్నారు.

ఆర్ధిక పరిస్థితి పట్టించుకోకుండా... ఇష్టం వచ్చినట్లుగా సిఎం చేస్తున్నారని, గతంలో చంద్రబాబు అవలంబించిన విధంగా జగన్ ఆలన చేస్తూ ప్రజలపై అప్పుల భారాలు మోపుతున్నారని మండిపడ్డారు. జగన్ కు అవగాహన లేకుంటే లక్షల జీతాలు ఇచ్చి పెట్టుకున్న సలహాదారులు ఏం చేస్తున్నారని ప్రశ్నించారు.

కేంద్రం ఇచ్చిన ప్రతి పధకానికి తన పేరు, తన తండ్రి పేరు పెట్టుకుంటున్నారని, ఈ విషయం పై స్పందన లో కూడా నేను దరఖాస్తు చేశానని తెలిపారు. ఈ ప్రభుత్వానికి పేర్లు పైత్యం బాగా ముదిరిందని, కోవిడ్ వైరస్ కి కూడా వైఎస్ఆర్ పేరు పెట్టారని, అదేమని ప్రశ్నిస్తే... భాజపాపై మాటల దాడి చేస్తున్నారని దుయ్యబట్టారు.

ఒక ఆకు రౌడీని మంత్రిగా చేస్తే ఎలా ఉంటుందో నానిని చూస్తే ఇప్పుడు అర్ధం అవుతుందన్నారు. వీధి రౌడీలా వ్యవహరిస్తున్న మంత్రి కొడాలి నాని వాడుతున్న భాష నీచంగా ఉందని అలా మాట్లాడుతున్నందుకు అతనికి సిగ్గుండాలని ఎద్దేవా చేశారు.

ఇంత జరుగుతున్నా సిఎం జగన్, నానిని ఎందుకు అదుపులో పెట్టడం లేదని ప్రశ్నించారు. అంతర్వేదిలో రథం దగ్ధం చేస్తే... ఆవేదనతో ఆందోళన చేస్తున్న భక్తులను ఒక ప్రార్ధనా మందిరం పై రాళ్లు వేసినట్లు అక్రమ కేసులు బనాయించి 41 మందిని అరెస్ట్ చేయడం వైఎస్ఆర్ సీపీ ప్రభుత్వ అరాచకమన్నారు. హిందువుల మనోభావాలు దెబ్బ తినేలా మాట్లాడిన వారి పై కేసులు ఉండవా ? అని పోలీసులను ప్రశ్నించారు.

తిరుమలలో సెల్ఫ్ డిక్లరేషన్ ఇవ్వడం ఆనవాయితీ గా వస్తుందని, ఇప్పుడు ఎవరు అడిగారని వై.వి. సుబ్బారెడ్డి ఈ అంశం పై ప్రకటన చేశారని ప్రశ్నించారు. అంటే వైసిపి పాలన లోపాలు గుర్తించకూడదనే ఇలా వివాదం చేస్తారా. ఇందిరాగాంధీ, కలాం వంటి మహానుభావులే డిక్లరేషన్ ఇచ్చారు. వారు సంస్కారవంతులు కాబట్టి.. నియమాలు పాటించారన్నారు.

జగన్ కూడా డిక్లరేషన్ ఇవ్వాలంటే అసభ్య పదజాలంతో దూషిస్తూ దాడులు చేస్తున్నారని ఆరోపించారు. గత చరిత్ర తెలుసుకుని వైసిపి నాయకులు మాట్లాడాలని, భాష మార్చుకోకపోతే... తగిన విధంగా సమాధానం చెబుతామని హెచ్చరించారు. కార్యక్రమంలో భాజపా యువమోర్చా జాతీయ కార్యదర్శి పనతల సురేష్ పాల్గొన్నారు.

వేదికను దీన్ దయాల్ శ్రవణ ఫౌండేషన్ ఛైర్మన్ రేగుల రామాంజనేయులు, జాతీయ పొగాకు బోర్డు ఛైర్మన్ వై.రఘునాధబాబు, సిద్ధార్ద అకాడమి ఛైర్మన్ నల్లూరి వేంకటేశ్వర్లు, రోటరీ క్లబ్ ప్రతినిధి జీవి రామారావు, న్యాయవాది చింతా వేంకటేశ్వరరావు, తెదేపా నాయకులు కాట్రగడ్డ బాబు తదితరులు పాల్గొన్నారు.