1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఐవీఆర్
Last Modified: గురువారం, 16 మే 2024 (15:19 IST)

జూన్ 4న ఏపీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు చూసి దేశం ఉలిక్కిపడుతుంది: వైఎస్ జగన్

ys jagan
జూన్ 4న వెలువడే ఆంధ్రప్రదేశ్ ఎన్నికల ఫలితాలను చూసి భారతదేశం ఉలిక్కిపడుతుందని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అన్నారు. ఆంధ్రప్రదేశ్‌లో మరోసారి వైఎస్సార్‌సీపీ అధికారంలోకి వస్తుందని జగన్‌మోహన్‌రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. ఇండియన్ పొలిటికల్ యాక్షన్ కమిటీ (ఐపాక్) ప్రతినిధులతో గురువారం జరిగిన సమావేశంలో సీఎం జగన్ గత ఎన్నికల కంటే ఎక్కువ సీట్లు గెలుచుకుని చరిత్ర సృష్టించబోతున్నామని జోస్యం చెప్పారు. ఏపీలో బూమ్ క్రియేట్ చేయబోతున్నాం. జూన్ 4న రానున్న ఫలితాలు చూసి దేశమంతా ఉలిక్కిపడుతుంది. ప్రశాంత్ కిషోర్ అంచనా వేసిన దానికంటే ఎక్కువ సీట్లు వస్తాయని అన్నారు.
 
IPAC గత సార్వత్రిక ఎన్నికల్లో YSRCPకి రాజకీయ సలహాదారుగా పనిచేసిన సంగతి తెలిసిందే. ఈసారి ప్రశాంత్ కిషోర్ అందులో లేరు. ఆయన బయటకు వచ్చేసారు. ఆయన లేనటువంటి టీమ్ వైసిపి కోసం పనిచేసింది. కాగా విజయవాడ బెంజిసర్కిల్‌ లోని ఐపాక్ కార్యాలయాన్ని సందర్శించిన సీఎం జగన్ సుమారు అరగంటపాటు బృందంతో చర్చలు జరిపారు. ప్రజాప్రతినిధులతో సెల్ఫీలు దిగి వారితో ముచ్చటించారు.
 
సిఎం జగన్‌ వ్యక్తం చేసిన విశ్వాసం, ఆశాభావం ఆ పార్టీ మద్దతుదారుల్లో ఉత్సాహాన్ని నింపాయి. 2019లో వైసిపి 151 అసెంబ్లీ సీట్లు, 22 ఎంపీ సీట్లు గెలుచుకుంది, ఇప్పుడు రాబోయే ఎన్నికల్లో ఆ సంఖ్యలను అధిగమించాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఆంధ్రప్రదేశ్‌లో హోరాహోరీగా సాగిన పోరు ఫలితాల కోసం దేశమంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. మరోవైపు జగన్ మోహన్ రెడ్డి పార్టీ వైసిపి ఘోరంగా ఓడిపోతుందనీ, ఆ పార్టీకి కేవలం 51 సీట్లు మాత్రమే వస్తాయని ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ వెల్లడించిన సంగతి తెలిసిందే.