శుక్రవారం, 29 మార్చి 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By వరుణ్
Last Updated : గురువారం, 24 నవంబరు 2022 (11:51 IST)

ప్రతి జిల్లాను ఓ రాజధానిగా అభివృద్ది చేస్తే సమస్యే ఉండదు : లక్ష్మీ నారాయణ

laxminarayana
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తలపెట్టిన మూడు రాజధానులతో ప్రజల మధ్య విద్వేషాలు తప్ప ఉపయోగం ఉండదని సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ అన్నారు. అన్ని సమస్యలకు పరిష్కారం లభించాలంటే.. రాష్ట్రంలోని 26 జిల్లాలను 26 రాజధానులుగా ప్రకటిస్తే సరిపోతుందన్నారు. ఈ తరహా విధానం ఇప్పటికే మహారాష్ట్రలో ఉందన్నారు. అక్కడ ప్రతి జిల్లాను రాజధానిలా అభివృద్ధి చేస్తున్నారని, అందుకే మహారాష్ట్ర వాసులు ఉద్యోగాల కోసం ఎక్కడికి వెళ్లరని ఆయన గుర్తుచేశారు. మనవాళ్లు మాత్రం ఇతర రాష్ట్రాలకు ఉపాధి కోసం వలస వెళతారన్నారు. 
 
వైజాగ్‌లో ఆంధ్రుడా మేలుకో అనే కార్యక్రమం జరుగగా, ఇందులో లక్ష్మీనారాయణ పాల్గొన్నారు. ఇందులో ఆయన మాట్లాడుతూ, మూడు రాజధానుల వల్ల ఎలాంటి ప్రయోజనం లేదన్నారు. ప్రాంతాల మధ్య విద్వేషాలు తప్ప దీనివల్ల ఒనగూరేది ఏమీ ఉండదన్నారు. మహారాష్ట్రలో ప్రతి జిల్లాను ఒక రాజధానిలా అభివృద్ధి చేస్తే ప్రాంతాల మధ్య విద్వేషాలకు తావు ఉండదన్నారు. అక్కడ తాను 22 సంవత్సరాల పాటు పని చేశానని, ఆ అనుభవంతో ఈ విషయాన్ని చెబుతున్నానని చెప్పారు. 
 
ముంబై, పూణె, థానే, ఔరంగాబాద్, నాగ్‌పూర్, నాసిక్ చుట్టూత ఎన్నో పరిశ్రమలు వచ్చాయని, ఉద్యోగాలు పెరిగాయన్నారు. అక్కడి ప్రజలు ఉపాధి కోసం, ఉద్యోగాల కోసం బయట రాష్ట్రాలకు వలస వెళ్లరన్నారు. మన వాళ్లు మాత్రం ఉద్యోగాల కోసం ఇతర రాష్ట్రాలకు వెళతారని చెప్పారు.