1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By వరుణ్

కదిరి వెళ్లి దస్తగిరి గొడ్డలి తెచ్చేంతవరకు భాస్కర్ రెడ్డిని ఇంట్లోనే సునీల్...

viveka deadbody
తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన వైకాపా మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో సంచలన విషయాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. ముఖ్యంగా, ఈ కేసులోని కుట్రదారుల్లో ఒకరైన వైఎస్ భాస్కర్ రెడ్డిని ఆదివారం తెల్లవారుజామున పోలీసులు అరెస్టు చేశారు. వైఎస్ వివేకానంద రెడ్డి గుండెపోటుతో చనిపోయారంటూ ప్రచారం చేయడంలో వైఎస్ భాస్కర్ రెడ్డి పాత్ర ఉన్నట్టు సీబీఐ ఓ స్పష్టమైన నిర్ధారణకు వచ్చింది. అంతేకాకుండా, హత్య జరిగిన తర్వాత సాక్ష్యాలు చెరిపేయడంలో భాస్కర్ రెడ్డి పాత్ర ఉందని సీబీఐ అభియోగం మోపింది. 
 
వివేకా హత్యకు ముందు భాస్కర్ రెడ్డి ఇంట్లోనే సునీల్ ఉన్నట్టు గూగుల్ టేకౌట్ ద్వారా గుర్తించినట్టు సీబీఐ అధికారులు చెబుతున్నారు. కదిరి వెళ్లిన దస్తగిరి గొడ్డలి తెచ్చేంతవరకు భాస్కర్ రెడ్డి ఇంట్లోనే సునీల్ ఉన్నాడు. 2019 మార్చి 14వ తేదీన వైఎస్. భాస్కర్ రెడ్డి ఇంట్లో సునీల్ యాదవ్ ఉన్నాడు. ఇంట్లో సునీల్ యాదవ్ ఉన్న సమయంలో భాస్కర్ రెడ్డి తన 2 ఫోన్లు స్విచాప్ చేశారు. 14వ తేదీ సాయంత్రం 6.14 గంటల నుంచి 6.31 గంటల వరకు భాస్కర్ రెడ్డి ఇంట్లోనే సునీల్ ఉన్నట్టు సీబీఐ చెబుతోంది. 
 
కాగా, వివేకా హత్యలో భాస్కర్ రెడ్డి పాత్రపై సీబీఐ అధికారులు పలు అనుమానాలను వ్యక్తం చేస్తున్నారు. "2017 ఎమ్మెల్సీ ఎన్నికల్లో వివేకా ఓడిపోయారు. వివేకా ఓటమిలో భాస్కర్ రెడ్డి, అవినాశ్ రెడ్డిలు కీలక పాత్ర పోషించారు. ఓటమి తర్వాత భాస్కర్ రెడ్డి, అవినాశ్ రెడ్డిలపై వివేకానంద ఆగ్రహం వ్యక్తం చేశారు. వివేకా వల్ల తమకు రాజకీయంగా ఎదుగుదల ఉండదని తండ్రికొడుకులిద్దరూ భావించారు. రాజకీయంగా అడ్డు తొలగించుకునేందుకే హత్య చేశారు" అని సీబీఐ అధికారులు బలంగా అనుమానిస్తున్నారు.