1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : సోమవారం, 27 ఫిబ్రవరి 2023 (10:58 IST)

నిద్రపట్టలేదని అర్థరాత్రి కారులో షికారుకెళ్లిన యువకులు... కాటేసిన మృత్యువు

car accident
చిత్తూరు జిల్లా కుప్పంలో పెను విషాదం జరిగింది. నిద్రపట్టడం లేదని అర్థరాత్రి కారులో షికారుకు వెళ్లిన ముగ్గురు యువకులను లారీ రూపంలో వచ్చిన మృత్యువు కాటేసింది. వీరు ప్రయాణించిన కారు.. అమిత వేగంతో నియంత్రణ కోల్పోయి లారీని ఢీకొట్టడంతో దుర్మరణం పాలయ్యారు. కుప్పం మండలంలోని చిన్నశెట్టిపల్లిలో ఆదివారం జరిగిన ఈ విషాదకర ఘటన వివరాలను పరిశీలిస్తే, 
 
కుప్పం పీఈఎస్ వైద్య కాలేజీలో ఎంబీబీఎస్ చదువుతున్న ఓ విద్యార్థి పుట్టిన రోజు వేడుకలకు అతడి పెద్దమ్మ కుమారుడైన మిట్స్ కళాశాల విద్యార్థి వెంకటసాయి, పీఈఎస్‌లో ఎంబీబీఎస్ ఫైనల్ ఇయర్ చదువుతున్న శ్రీవికాస్ రెడ్డి, తృతీయ సంవత్సరం చదువుతున్న తలారి ప్రవీణ్‌, మరికొంతమంది స్నేహితులు వెళ్లారు. 
 
శనివారం అర్థరాత్రి వరకు వీరు తన స్నేహితుడి పుట్టిన రోజు వేడుకల్లో నిమగ్నమయ్యారు. ఆ తర్వాత కొందరు విద్యార్థులు ఓ గదిలో నిద్రపోయారు. అయితే, శ్రీవికాస్ రెడ్డికి ఎంతకీ నిద్రరాకపోవడంతో అలా తిరిగివద్దామంటూ ప్రవీణ్, వెంకటసాయితో కలిసి ఆదివారం తెల్లవారుజామున కారులో షికారుకు వెళ్లారు. 
 
కారును అమిత వేగంతో డ్రైవ్ చేయడంతో అది నియంత్రణ కోల్పోయి ఎదురుగా వస్తున్న లారీని బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదం ఎంత భయంకరంగా జరిగిందంటో.. ప్రమాదం తర్వాత కారు ఆనవాలే లేకుండా నుజ్జునుజ్జుగా మారిపోయింది. ఈ ఘటనలో వారు ముగ్గురూ కారులోనే మృత్యువాతపడ్డారు. 
 
సమాచారం అందుకున్న పోలీసులు అక్కడకు చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. మృతదేహాలను స్వాధీనం చేసుకుని కుప్పం ఆస్పత్రికి తరలించారు. అతివేగం, నిర్లక్ష్యం కారణంగానే ఈ ప్రమాదం జరిగినట్టు పోలీసులు చెబుతున్నారు. కాగా, అర్థరాత్రి వరకు బర్త్‌డే వేడుకల్లో పాల్గొన్న స్నేహితులు... తెల్లవారేసరికి మృత్యుఒడిలోకి జారుకోవడంతో బంధువులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు. మృతుల తల్లిదండ్రులు కన్నీరుమున్నీరవుతున్నారు.