1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By వరుణ్
Last Updated : బుధవారం, 26 జులై 2023 (16:54 IST)

మదనపల్లె మార్కెట్‌లో మళ్లీ పెరిగిన టమోటా ధర....ఎంతంటే?

tomatos
కర్నూలు జిల్లా మదనపల్లె మార్కెట్‌లో టమోటా ధర మళ్లీ పెరిగింది. ఈ మార్కెట్‌లో బుధవారం రికార్డు స్థాయిలో ధర పెరిగింది. నాణ్యమైన టమోటా ఒక కేజీ ఏకంగా రూ.168 నుంచి రూ.170 వరకు పలికింది. ఈ మార్కెట్‌కు రైతులు మొత్తం 361 టన్నుల టమోటాలను తీసుకొచ్చారు. వీటికి గ్రేడింగ్ ప్రకారం ధర పలికింది. 
 
ఏ గ్రేడ్‌ ధర రూ.140 నుంచి రూ.170 వరకు, బి గ్రేడ్ ధర రూ.118 నుంచి రూ.138 వరకు పలికింది. సగటున కిలో ధర రూ.132 నుంచి రూ.156 వరకు పలికినట్టు మార్కెట్ వ్యాపారులు తెలిపారు. మంగళవారం ఈ మార్కెట్‌లో నాణ్యమైన ధర రూ.140 పలుకగా, అది బుధవారానికి రూ.168కి చేరింది. 
 
మరోవైపు 30 కేజీల టమోటా ట్రే ధర రూ.4200గా పలుకుతుంది. వారం రోజుల క్రితం దీని ధర రూ.3500 నుంచి రూ.3800 వరకు ఉండేది. టమోటా ధరలు భారీగా పెరగడంతో స్థానిక రైతులు ఆనందంగా ఉన్నప్పటికీ వినియోగదారులు మాత్రం గగ్గోలు పెడుతున్నారు. 
 
భర్తను కొట్టి చంపారు.. భార్యను చీరతో ఉరేశారు.. 
 
తెలంగాణ రాష్ట్రంలోని కామారెడ్డి జిల్లా బీర్కూరులో దారుణం జరిగింది. మండలంలోని రైతు నగర్‌లో దంపతుల జంటను గుర్తు తెలియని వ్యక్తులు అత్యంత కిరాతకంగా చంపేశారు. భర్తను కొట్టి చంపేశారు. ఆయన భార్యను చీరతో ఉరేశారు. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, 
 
మండలంలోని రైతునగర్‌కు చెందిన నారాయణ అనే వ్యక్తి కిరాణాషాపు నిర్వహిస్తున్నాడు. మంగళవారం రాత్రి ఇంటి వెనుక నుంచి లోపలికి ప్రవేశించి కొందరు దుండగులు నారాయణను ఆయుధంతో కొట్టి చంపేశారు. ఆ తర్వాత ఆయన భార్యను చీరతో ఉరేశారు. దీన్ని దోపిడీ దొంగల పనిగా స్థానికులు భావిస్తున్నారు. పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని పరిశీలించారు. 
 
సిగ్నల్ ఇవ్వలేదు.. రైలు ఆపలేదు..  
 
రైల్వే స్టేషన్ మేనేజర్ సిగ్నెల్ ఇవ్వని కారణంగా స్టేషన్‌లో ఆగాల్సిన రైలు ఆగలేదు. దీన్ని గమనించిన లోకో పైలెట్.. స్టేషన్‌కు కిలోమీటరు దూరంలో రైలును ఆపారు. ఈ వింత అనుభవం ఆదోనీ రైల్వే స్టేషన్‌లో జరిగింది. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, 
 
కర్నూలు జిల్లా ఆదోని రైల్వే స్టేషన్‌లో ముంబై నుంచి ఎంజీఆర్‌ చెన్నై సెంట్రల్‌ వారాంతపు రైలు (22179) ఆగాల్సివుంది. ఈ రైలు ఆదోనికి ప్రతి మంగళవారం తెల్లవారుజామున 1.40 గంటలకు వచ్చి చేరుతుంది. ఆదోని మీదుగా చెన్నై, కడప, రేణిగుంట, తిరుపతి వెళ్లాల్సిన ప్రయాణికులు మంగళవారం స్టేషన్‌కు చేరుకున్నారు. 
 
రైలు ఐదు గంటలు ఆలస్యంగా ఉదయం 6.40 గంటలకు ఆదోనికి వచ్చింది. కానీ బండి వస్తున్న సమయంలో ఎలాంటి ప్రకటన చేయలేదు. ప్లాట్‌ఫాంపై నిలిచే బోగీల సంఖ్యను కూడా సూచించలేదు. ప్రయాణికులు చూస్తుండగానే బండి స్టేషన్‌లో ఆగకుండా వెళ్లిపోయింది. దీంతో ప్రయాణికులు కేకలు వేస్తూ.. రైలు వెంట పరుగులు తీశారు. గార్డు అప్రమత్తమై లోకో పైలట్‌కు సమాచారం ఇవ్వడంతో స్టేషన్‌ నుంచి కి.మీ.దూరం వెళ్లి నిలిచింది.
 
కొందరు ప్రయాణికులు అక్కడికి వెళ్లి గార్డుతో వాగ్వాదానికి దిగారు. స్టేషన్‌ మాస్టర్‌ సిగ్నల్‌ ఇవ్వకపోవడంతో రైలు ఆపలేదని గార్డు ప్రయాణికులకు వివరించారు. ఈ విషయంపై ఆదోని స్టేషన్‌ మేనేజర్‌ వెంకటేశులును వివరణ కోరగా ఈ నెల మొదటి వారం వరకు ఈ రైలు ఆదోని స్టేషన్‌లో ఆగేది కాదన్నారు. ఇటీవల ఆగుతున్న విషయం కొత్తగా బాధ్యతలు చేపట్టిన స్టేషన్‌ మాస్టర్‌కు తెలియకపోవడంతో సిగ్నల్‌ ఇవ్వలేదని వివరించారు.