శనివారం, 20 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : గురువారం, 17 ఫిబ్రవరి 2022 (08:52 IST)

నేడు విజయవాడకు కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ

కేంద్ర జాతీయ రహదారుల శాఖామంత్రి నితిన్ గడ్కరీ గురువారం విజయవాడకు వస్తున్నారు. ఈ సందర్భంగా ఆయన పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించనున్నారు. మరికొన్ని అభివృద్ధి ప్రాజెక్టులకు శంకుస్థాపనలు చేయనున్నారు. 
 
కేంద్ర జాతీయ రహదారుల మంత్రిత్వ శాఖ నిర్మించిన 20 రోడ్లు, ఇతర ప్రాజెక్టులను కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ ప్రారంభిస్తారు. అలాగే, కొత్తగా మరో 31 జాతీయ రహదారుల ప్రాజెక్టులకు గడ్కరీ భూమి పూజ చేస్తారు. మధ్యాహ్నం ఇందిరా గాంధీ స్టేడియంలో ఏర్పాటు చేసిన ఫోటో ప్రదర్శనను తిలకిస్తారు. ఆ తర్వాత అక్కడ ఏర్పాటు చేసిన సభలో గడ్కరీ పాల్గొని ప్రసంగిస్తారు. ఇందులో ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి కూడా పాల్గొంటారు. 
 
ఆ తర్వాత బెంజ్ సర్కిల్‌కు చేరుకుని, అక్కడ కొత్తగా నిర్మించిన ఫ్లై ఓవర్‌ను ఆయన ప్రారంభిస్తారు. గుడివాడ రైల్వే గేట్లు దాటేందుకు 2.5 కిలో మీటర్ల మేరకు వంతెనను నిర్మించారు. ఇందుకోసం కేంద్రం రూ.317.22 కోట్లను మంజూరు చేసింది. ఈ పర్యటన సమయంలో ఆయన ఏపీ బీజేపీ శాఖ కార్యాలయంలో కొంత సేపు గడుపనున్నారు.