శనివారం, 20 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By జెఎస్కే
Last Modified: విజ‌య‌వాడ‌ , సోమవారం, 24 జనవరి 2022 (14:25 IST)

ఎర్ర కోట వ‌ద్ద రిపబ్లిక్ డే పరేడ్... కోవిడ్ మార్గదర్శకాల‌ జారీ

న్యూఢిల్లీలో ఎర్ర‌కోట వ‌ద్ద ఈనెల 26న రాజ్‌పథ్‌లో జరిగే రిపబ్లిక్ డే పరేడ్‌కు హాజరయ్యే వారి కోసం ఢీల్లీ పోలీసులు సోమవారం మార్గదర్శకాలు జారీ చేశారు. వ్యాక్సినేషన్ డోస్‌లు పూర్తిగా వేయించుకుని ఉండాలని, 15 ఏళ్ల లోపు పిల్లలను అనుమతించేది లేదని ఆ మార్గదర్శకాల్లో పేర్కొన్నారు. ఫేస్ మాస్క్‌లు ధరించడం, సామాజిక దూరం పాటించడం సహా కోవిడ్ నిబంధనలను తు.చ. తప్పకుండా పాటించాలని ఓ ట్వీట్‌లో ఢిల్లీ పోలీసులు స్పష్టం చేశారు.
 
 
రిప‌బ్లిక్ డే ప‌రేడ్ లో పాల్గొనే విజటర్ల కోసం సీటింగ్ బ్లాక్‌లు ఉదయం 7 గంటలకు తెరుస్తారని, లిమిటెడ్ పార్కింగ్ కారణంగా విజిటర్లు కార్‌పూల్ లేదా టాక్సీలను వినియోగించాలని మార్గదర్శకాల్లో సూచించారు. వాలీడ్ ఐడెంటిటీ కార్డులు తెచ్చుకోవాలని, సెక్యూరిటీ తనిఖీలకు సహకరించాలని పేర్కొన్నారు. ప్రతి పార్కింగ్ ఏరియాలోనూ రిమోట్ కంట్రోల్డ్ కార్ లాక్ కీలు డిపాజిట్ చేసే వీలు కల్పించినట్టు తెలిపారు. 

 
రిపబ్లిక్ డే సందర్భంగా 27,000 మంది పోలీసు సిబ్బందిని మోహరిస్తున్నామని, ఎలాంటి ఉగ్రవాద దాడులు చోటుచేసుకోకుండా చర్యలు పటిష్టం చేసామని ఢిల్లీ పోలీస్ కమిషనర్ రాకేష్ ఆస్థానా తెలిపారు. 71 మంది డీసీపీలు, 213 మంది ఏసీపీలు, 753 మంది ఇన్‌స్పెక్టర్లు పరేడ్‌ కోసం మోహరించినున్నారని, వీరికి 65 కంపెనీల సీఓపీఎఫ్‌లు సహకరిస్తాయని చెప్పారు.