గురువారం, 28 మార్చి 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎం
Last Modified: శుక్రవారం, 11 జూన్ 2021 (20:56 IST)

రాష్ట్రంలో చురుగ్గా వ్యాక్సినేషన్: వైద్య ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి అనిల్‌కుమార్ సింఘాల్

అమరావతి: రాష్ట్రంలో కరోనా వ్యాక్సినేషన్ కార్యక్రమం చురుగ్గా సాగుతందని, కేంద్ర ప్రభుత్వం నుంచి వస్తున్న టీకాలు ఎప్పటికప్పుడు పంపిణీ చేస్తున్న‌ట్లు వైద్య ఆరోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి అనిల్‌కుమార్ సింఘాల్ తెలిపారు. మంగళగిరిలోని ఏపీఐఐసీ భవనంలో శుక్రవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు.

గడిచిన 24 గంటల్లో 1,01,863 శాంపిళ్లు పరీక్షించగా 8,239 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయని, 61 మంది మృతి చెందారని తెలిపారు. రాష్ట్రంలో కరోనా పాజిటివిటీ రేటు తగ్గుతున్నా శాంపిళ్లు ఎక్కువగా నిర్వహిస్తున్నామన్నారు. జూన్ 10న పాజిటివిటీ రేట్ 8.29, జూన్ 11న 8.09గా నమోదైందన్నారు. రికవరీ రేటు 94 శాతంగా నమోదవుతోందన్నారు.

అదే సమయంలో మరణాలు కూడా తగ్గుముఖం పడుతున్నాయన్నారు. కరోనా కారణంగా జూన్ 10న 67 మంది మృతి చెందగా, జూన్ 11న 61 మంది ప్రాణాలు కోల్పోయారని పేర్కొన్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో 96,100 యాక్టివ్ కేసులు ఉన్నాయన్నారు.

25 రోజుల కిందట 2,11,000 వరకూ కరోనా కేసులు నమోదయ్యాయన్నారు. వివిధ ఆసుపత్రుల్లో 15,951 చికిత్స పొందుతున్నారన్నారు. కొవిడ్ కేర్ సెంటర్లలో 8,963 మంది, హోం ఐసోలేషన్ లో 71,186 మంది వైద్య సేవలు పొందుతున్నారన్నారు.  టెలీ మెడిసిన్ కాల్ సెంటర్ ద్వారా 20,500 మంది తో వైద్యలు మాట్లాడారన్నారు. గడిచి,న 24 గంటల్లో 104 కాల్ సెంటర్ కు 2,592 ఫోన్ కాల్స్ వచ్చాయని, వాటిలో వివిధ సమాచారాలకు 1,387 కాల్స్, అడ్మిషన్ల కోసం 319 ఫోన్ కాల్స్ వచ్చాయన్నారు.
 
వివిధ ఆసుపత్రుల్లో పెరిగిన పడకల ఖాళీల సంఖ్య...
రాష్ట్రంలో కరోనా కేసులు తగ్గుముఖం పడుతుండడంతో పలు ఆసుపత్రుల్లో కొవిడ్ చికిత్సలకు బదులు ఇతర చికిత్సలు అందజేస్తున్నాయని, కరోనా తీవ్రంగా ఉన్న సమయంలో రాష్ట్రంలో 625 ఆసుపత్రుల్లో కొవిడ్ కు చికిత్స  అందజేసేవారన్నారు. ప్రస్తుతం కరోనా తీవ్రత తగ్గడంతో 454 ఆసుపత్రుల్లో కొవిడ్ నివారణ చికిత్సలు అందజేస్తున్నారన్నారు.

అన్ని జిల్లాల్లో ఐసీయూ బెడ్లు అందుబాటులో ఉన్నాయన్నారు.  ప్రస్తుతం 2,231 బెడ్లు రాష్ట్ర వ్యాప్తంగా అందుబాటులో ఉన్నాయన్నారు. 10,447 ఆక్సిజన్ బెడ్లు రోగులతో నిండి ఉండగా, 11,290 బెడ్లు అందుబాటులో ఉన్నాయన్నారు. రాష్ట్రంలో ఆక్సిజన్ వినియోగం కూడా తగ్గుతోందన్నారు. రోజువారీగా చూస్తే కేంద్ర ప్రభుత్వం...ఏపీకి 590 మెట్రిక్ టన్నుల ఆక్సిజన్ కేటాయిస్తోందన్నారు. గడిచిన 24 గంటల్లో కేంద్ర ప్రభుత్వ నుంచి 423 మెట్రిక్ టన్నుల ఆక్సిజన్ ను మాత్రమే డ్రా చేశామన్నారు. కరోనా తీవ్రంగా ఉన్న రోజుల్లో 650 మెట్రిక్ టన్నుల వరకూ వినియోగించేవారమన్నారు.
 
రాష్ట్రంలో తగ్గుతున్న బ్లాక్ ఫంగస్ కేసులు...
రాష్ట్రంలో ప్రస్తుతం 1,307 బ్లాక్ ఫంగస్ యాక్టివ్ కేసులు ఉన్నాయన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా బ్లాక్ ఫంగస్ తో 138 మంది మృతి చెందారన్నారు. బ్లాక్ ఫంగస్ కేసులను దాచిపెడుతున్నారనే ఆరోపణలు సరికాదన్నారు. కేసులు దాచిపెట్టడం వల్ల నష్టమే కలుగుతుందన్నారు. దీనివల్ల కేంద్ర ప్రభుత్వం నుంచి బ్లాక్ ఫంగస్ నివారణకు రావాల్సిన ఆంపోటెరిసిన్ బి ఇంజక్షన్లు రాకుండా పోతాయన్నారు. కరోనా కేసులు మాదిరిగా బ్లాక్ ఫంగస్ కేసులు కూడా తగ్గుతున్నాయన్నారు. ఇతర రాష్ట్రాలతో పోల్చి చూసుకోవాల్సిన అవసరం లేదన్నారు. ఉన్నది ఉన్నట్లుగా... ఏపీలో కరోనా కేసులు, బ్లాక్ ఫంగస్ కేసులు, వాటి వల్ల సంభవించే మరణాల సంఖ్య ఎప్పటికప్పుడు చెబుతున్నామన్నారు.