శుక్రవారం, 29 మార్చి 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : మంగళవారం, 6 ఏప్రియల్ 2021 (10:00 IST)

అన్నతో పెళ్లి చూపులు.. తమ్ముడుతో నిశ్చితార్థం : జీర్ణించుకోలేక...

పెళ్లి చూపుల్లో తనకు నచ్చిన యువతి... తన తమ్ముడిని పెళ్లి చేసుకుంటానని పెద్దల సమక్షంలో చెప్పింది. ఈ మాటలు అన్నకు చెంపదెబ్బలా అనిపించాయి. తనకు దక్కాల్సిన అమ్మాయి.. తన తమ్ముడుకు సొంతమవుతుందన్న విషయాన్ని అన్న జీర్ణించుకోలేక పోయాడు. అంతే.. కిరాతకుడుగా మారిపోయిన అన్న.. తోడబుట్టిన తమ్ముడిని చంపేశాడు. ఈ దారుణం విశాఖపట్టణం జిల్లా అచ్యుతాపురం మండలం పూడిమడకలో జరిగింది.
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, విశాఖపట్నం జిల్లా అచ్యుతాపురం మండలం పూడిమడక శివారు జాలారిపాలెంకు చెందిన మడ్డు రాజు అనే వ్యక్తి నెల క్రితం కుటుంబ సభ్యులతో కలిసి భీమిలిలో పెళ్లి చూపులకు వెళ్లాడు. 
 
కాగా ఆ అమ్మాయి ఇష్టం ప్రకారం అతడి తమ్ముడు ఎర్రయ్య (23)తో 15 రోజుల  క్రితం నిశ్చితార్థం జరిగింది. వచ్చే నెలలో వివాహం చేయాలని పెద్దలు నిర్ణయించారు. అప్పటి నుంచి అన్నదమ్ముల మధ్య గొడవలు మొదలయ్యాయి. 
 
ఎర్రయ్య ఆదివారం చేపల వేటకు వెళ్లి రూ.2 వేలు సంపాదించగా సెల్‌ఫోన్‌ కొనుక్కొనేందుకు అన్నకి ఇవ్వాలని తల్లి చెప్పింది. ఈ విషయమై సోమవారం అన్నదమ్ములిద్దరూ గొడవపడ్డారు. మధ్యాహ్నం ఇంట్లో కత్తితో మాటువేసిన రాజు... లోపలకు వచ్చిన ఎర్రయ్య మెడపై బలంగా పొడవడంతో గాయపడ్డాడు. అనకాపల్లి తరలిస్తుండగా దారిమధ్యలో చనిపోయాడు. 
 
సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని రాజును అదుపులోకి తీసుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు. తనకు కావాల్సిన భర్త.. శవంగా మారడంతో ఆ వధువు బోరున విలపిస్తోంది.