నరసాపురం - చెన్నై ప్రాంతాల మధ్య కొత్త వందే భారత్ రైలు.. మైసూరుకు ఎక్స్ప్రెస్ సర్వీసు
వెస్ట్ గోదావరి జిల్లాలోని ముఖ్యమైన లోక్సభ స్థానమైన నరసాపురానికి జాక్పాట్ తగిలింది. నరసాపురం నుంచి తొలి వందే భారత్ రైలు పరుగులు పెట్టనుంది. చెన్నై నుంచి నరసాపురం వరకు కొత్త వందే భారత్ సర్వీసును నడుపనున్నారు. ఈ రైలు సర్వీసు త్వరలోనే అందుబాటులోకి రానుంది. ఇది వారానికి రెండు రోజుల పాటు అందుబాటులో ఉంటుందని కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాస వర్మ వెల్లడించారు.
ఇదే అంశంపై కేంద్ర మంత్రి శ్రీనివాస వర్మ మాట్లాడుతూ, ఎన్నికల్లో ఇచ్చిన హామీని నెరవేర్చడం ఆనందంగా ఉందన్నారు. నరసాపురం పార్లమెంట్ చరిత్రలో తొలిసారిగా వందే భారత్ రైలు సేవలు అందుబాటులోకి రానున్నాయని, చెన్నై నుంచి నరసాపురం వరకు ఈ రైలును నడిపేందుకు రైల్వే శాఖ ఆమోదం తెలిపిందని కేంద్రమంత్రి శ్రీనివాస వర్మ ఒక ట్వీట్లో వెల్లడించారు. దీనికి సంబంధించిన గెజిట్ నోటిఫికేషనన్ను త్వరలోనే విడుదల చేసి, రైలు ప్రారంభ తేదీని దక్షిణ మధ్య రైల్వే ప్రకటిస్తుందని ఆయన వివరించారు. తన విజ్ఞప్తికి సహకరించిన రైల్వే మంత్రికి, అధికారులకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు.
మరోవైపు, నరసాపురం నుంచి మైసూరుకు హైదరాబాద్ మీదుగా నడిచే ప్రత్యేక ఎక్స్ప్రెస్ రైలుకు (07033/07034) కూడా ఆమోదం లభించింది. ఈ రైలు సర్వీసు ఈ నెల 19వ తేదీ నుంచే ప్రారంభం కానుంది. వారంలో రెండు రోజులు (సోమ, శుక్రవారం) ఈ రైలు అందుబాటులో ఉంటుందని మంత్రి స్పష్టం చేశారు. ఈ రైలు వల్ల హైదరాబాద్ వెళ్లే పశ్చిమ గోదావరి జిల్లా ప్రయాణికులకు ప్రయాణం మరింత సులభతరం కానుంది.
ఈ ప్రత్యేక రైలు నరసాపురం నుంచి బయలుదేరి పాలకొల్లు, భీమవరం, ఆకివీడు, గుడివాడ, విజయవాడ, గుంటూరు, పిడుగురాళ్ల, మిర్యాలగూడ, నల్గొండ మీదుగా సికింద్రాబాద్ చేరుకుంటుంది. అక్కడి నుంచి బేగంపేట, వికారాబాద్, రాయచూర్, గుంతకల్లు, అనంతపురం, ధర్మవరం, యెలహంక, బెంగళూరు సిటీ మీదుగా మైసూరుకు ప్రయాణిస్తుంది. నరసాపురం ప్రజలకు మరిన్ని మెరుగైన రైలు సేవలు అందించేందుకు కృషి చేస్తానని శ్రీనివాస వర్మ హామీ ఇచ్చారు.