శనివారం, 27 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎం
Last Updated : శనివారం, 8 ఫిబ్రవరి 2020 (04:14 IST)

జగన్‌ కన్నా మాయగాడెవరు?: బుద్దా వెంకన్న

గోబెల్స్ ప్రచారంలో సీఎం జగన్‌ను మించిన వారు ఎవరున్నారో చెప్పాలని రాజ్యసభ ఎంపీ విజయసాయిరెడ్డిని టీడీపీ నేత బుద్దా వెంకన్న ప్రశ్నించారు.

రాజ్యసభ ఎంపీ విజయసాయిరెడ్డి ట్వీట్లకు కౌంటర్ ఇచ్చారు బుద్దా వెంకన్న. బంగాళాఖాతాన్ని వెనక్కి జరపాలన్నా, నదులని వెనక్కి ప్రవహించేలా చెయ్యాలన్నా, మూడు మాయా రాజధానులు కట్టాలన్నా అది జగన్ నడిపే దొంగ బ్లాక్ మీడియాకే చెల్లిందని విమర్శించారు.

‘‘పోలవరానికి పునాది పడలేదు, కమ్మ డీఎస్పీలకు మాత్రమే ప్రమోషన్లు, అమరావతి అంతా గ్రాఫిక్స్ అంటూ రాష్ట్రంలో అసత్యాల తుఫాను సృష్టించిన బ్లాక్ మీడియాను నడిపే మీరా నీతులు చెప్పేది విజయసాయి రెడ్డి.

తుఫాన్లు ఆపడం, తండ్రి పోతే ఇంట్లో వాళ్లు ఎవరూ పోకపోయినా, నాన్న కోసం వేలమంది పోయారు అంటూ బిల్డప్ వార్తలు, గ్రాఫిక్స్ లో జనాలు సృష్టించడం ఒక్క వైఎస్ ఫ్యామిలీకే దక్కింది’’ అంటూ తనదైన శైలిలో విమర్శలు గుప్పించారు.

రివర్స్ పాలన అమలు చేస్తూ ప్రజలతో పబ్జి గేమ్ ఆడుతున్న జగన్‌ను మించిన మాయగాడు ఎవరు ఉంటారు సాయి రెడ్డి అని ట్విట్టర్ వేదికగా బుద్దా వెంకన్న ప్రశ్నించారు.
 
అంతకుముందు.. చంద్రబాబును విమర్శిస్తూ విజయసాయిరెడ్డి తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. బంగాళాఖాతం తీరం నుంచి దూరంగా జరిగిపోతోందని.. నదులన్నీ వెనక్కి ప్రవహస్తున్నాయని.. ఆఫ్రికా నుంచి మిడతల దండు ఇటే వస్తోందని.. ఆంధ్రా వైపు భారీ గ్రహ శకలం దూసుకొస్తున్నట్టు నాసా హెచ్చరించిందని.. ఇలాంటి వార్తలు ప్రచారం చేస్తారంటూ ట్వీట్ చేశారు.

ఐదు కోట్ల మంది ప్రజలతో చంద్రబాబు గేమ్స్ ఆడుతున్నారంటూ మండిపడ్డారు.