1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎంజీ
Last Updated : గురువారం, 30 సెప్టెంబరు 2021 (08:13 IST)

అక్టోబర్ నెల నుంచి అయినా పింఛన్ ఇస్తారా?: సాకే శైలజనాథ్

ప్రభుత్వం వచ్చే అక్టోబర్ నెలనుంచి అయినా వృద్ధులకు పింఛన్లు ఇవ్వాలని ఆంధ్ర ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు డాక్టర్ సాకే శైలజనాథ్ అన్నారు. గత ప్రభుత్వం 54 లక్షల పెన్షన్లు ఇవ్వగా ఈ ప్రభుత్వం వచ్చీ రాగానే 4 లక్షల పెన్షన్లు అనర్హులంటూ పలు కారణాలు చెప్పి తొలగించిందని,  10 లక్షల పెన్షన్లు ఇస్తున్నామంటూ కొత్తగా పెన్షన్లు మంజూరు చేయడంతో అవి 60 లక్షలకు చేరాయని తెలిపారు. 

ఆంధ్ర రత్న భవన్ నుండి విడుదల చేసిన ప్రకటనలో ఇన్ని సార్లు వడపోసి సరిచూసుకున్న పెన్షన్లలో ఇప్పుడు అనర్హులున్నారంటూ అనుమానిస్తోందని, సంక్షేమ పథకాలు పెరిగిపోవడం, ప్రతి నెలా నగదు బదిలీకి నిధులు అందకపోవడంతో ప్రభుత్వం సంక్షేమ పథకాల లబ్ధిదారుల సంఖ్యపై కోత పెట్టేందుకు ప్రయత్నాలు ప్రారంభించిందన్నారు. 

అవ్వాతాతలను ప్రభుత్వం పదేపదే పెన్షన్ టెన్షన్కు గురి చేస్తోంది. వేర్వేరు సాకులతో ఇప్పటికే రెండు లక్షల పింఛన్లను కోసేశారు. తాజాగా మరో 10 లక్షల పెన్షన్లకు ఎసరు పెట్టారు. అన్ని అర్హతలు కలిగి కొన్నేళ్లుగా పింఛన్లు పొందుతున్న వారి పేర్లే ఎక్కువగా ఈ జాబితాలో ఉండటం వారిని విస్తుగొలుపుతోంది. వారి పింఛన్లను ఏ ప్రాతిపదికన పరిశీలించాలనేది స్పష్టం చేయకపోవడం గమనార్హం. 

రాష్ట్ర వ్యాప్తంగా 60 లక్షల మంది పెన్షన్దారులు ఉన్నారు. వీరిలో 10 లక్షల మందిదాకా అనర్హులు పెన్షన్లు పొందుతున్నారని ప్రభుత్వం అనుమానిస్తున్నట్టు సమాచారం. పెన్షన్లు పొందేందుకు చాలా కుటుంబాలు రేషన్ కార్డులను స్ప్లిట్ చేశాయని, దానికి వలంటీర్లు సహకరించారని భావిస్తోంది. అందుకే వలంటీర్లు స్వయం గా పరిశీలించి ఆమోదించిన లబ్ధిదారుల జాబితాపై కూడా అనుమానం వ్యక్తం చేస్తోంది.

అందుకే ఈ జాబితాను గతంలో తీసిన సాధికార సర్వేతో పోల్చి పాత కుటుంబాల ఆధారంగా అర్హులను గుర్తించాలని భావిస్తోంది. వైసీపీ అధికారంలోకి రాగానే గత సాధికార సర్వేను పక్కనపెట్టింది. వలంటీర్లు చేపట్టిన హౌస్ హోల్డ్ మ్యాపింగ్ ఆధారంగా కొత్త పింఛన్లు మంజూరుచేసింది. ఆరంచెల వ్యాలిడేషన్ ను అమల్లోకి తెచ్చి ప్రతి నెలా పెన్షన్ను తొలగిస్తుందని శైలజనాథ్ జగన్ రెడ్డి ప్రభుత్వం పై మండిపడ్డారు. తక్షణమే అర్హులైనవారందరికి పెన్షన్లు ఇవ్వాలని డిమాండ్ చేశారు.