శనివారం, 20 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : గురువారం, 3 డిశెంబరు 2020 (06:45 IST)

బాలింత ప్రాణం తీసిన కోతులు.. ఎక్కడ ఎలా?

కోతులు ఆంజనేయస్వామికి ప్రతిరూపాలుగా భావిస్తారు. అందుకే అవి ఇళ్లలోకి వచ్చినా వాటిని కొట్టరు. అలాంటి కోతులు ఓ బాలింత ప్రాణాలు తీశాయి. ఈ కోతుల గుంపు ఆగడాలకు పండండి బిడ్డ జన్మనిచ్చిన ఓ బాలింత కన్నుమూసింది. ఈ విషాద దుర్ఘటన తెలంగాణ రాష్ట్రంలోని సూర్యాపేట జిల్లాలో జరిగింది.
 
ఈ వివరాలను పరిశీలిస్తే, సూర్యాపేట జిల్లా మద్దిరాల మండలంలో కుక్కడం గ్రామానికి చెందిన దోమల శ్రీలత(23) మంగళవారం కోతుల గుంపు చేసిన దాడిలో తీవ్రంగా గాయపడి అక్కడికక్కడే మృతి చెందింది. ఉదయం 8 గంటల సమయంలో ఇంట్లో వారంతా పనికి వెళ్లారు. శ్రీలత ఇటీవలనే పండంటి బిడ్డకు జన్మనిచ్చింది. 
 
తన బిడ్డతో ఆమె ఇంట్లోనే ఉండగా.. 9 గంటల సమయంలో కోతుల గుంపు ఇంట్లోకి ప్రవేశించాయి. తన బిడ్డ మీద కోతులు దాడి చేస్తాయని భయపడిన ఆమె.. వాటిని తరిమె ప్రయత్నం చేసింది. వెంటనే వానరమూక ఆమెపై మూకుమ్మడిగా దాడి చేయడంతో గడపపై పడి అక్కడికక్కడే కుప్పకూలి ప్రాణాలు విడిచింది. బాలింత మృతితో గ్రామంలో విషాదఛాయలు అములుకున్నాయి. శ్రీలతకు ముగ్గురు పిల్లలు ఉన్నారు.
 
కాగా గ్రామం నుంచి కోతులను తరిమేయాలని గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు. గతంలో పలుమార్లు అధికారులకు దృష్టికి తీసుకెళ్లినా.. పట్టించుకోదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇంకా ఎంతమంది ప్రాణాలు తీయాలని ప్రశ్నిస్తున్నారు. మృతురాలి భర్త ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.