1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By జెఎస్కే
Last Updated : సోమవారం, 9 ఆగస్టు 2021 (09:44 IST)

ఎంపీ రఘురామకు విజ‌య‌సాయి షాక్! రూ.826 కోట్ల కుంభకోణం!!

వైసీపీలో గ‌త ఏడాదిగా సాగుతున్న టామ్ అండ్ జెర్రీ పొలిటిక‌ల్ గేమ్ చ‌ర‌మాంకానికి చేరిన‌ట్లుంది. పార్టీలో ఉంటూనే రెబ‌ల్ గా మారిన ఎంపీ రఘురామ కృష్ణరాజుకు ఆ పార్టీ పార్లమెంటరీ నేత విజయసాయిరెడ్డి ఊహించని షాకిచ్చారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆస్తుల కేసులో ఎంపీ విజయసాయిరెడ్డి బెయిల్ రద్దు చేయాలంటూ సీబీఐ కోర్టులో ఎంపీ రఘురామ పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే.

ఈ పిటిషన్‌ను స్వీకరించిన సీబీఐ కోర్టు ఎంపీ విజయసాయిరెడ్డిని ఈ నెల 10లోపు కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశించింది. ఈ నేపథ్యంలో ఎంపీ రఘురామకు విజయసాయిరెడ్డి ఊహించని షాకిచ్చారు. ఎంపీ రఘురామకు చెందిన కంపెనీ రూ. 826 కోట్ల భారీ కుంభకోణానికి పాల్పడిందని కేంద్ర ప్రభుత్వానికి విజయసాయిరెడ్డి ఫిర్యాదు చేశారు. ఈ కేసు విచారణలో తీవ్ర జాప్యం జరుగుతోందని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌కు లేఖ రాశారు.

ఈ లేఖపై కేంద్ర మంత్రి సానుకూలంగా స్పందించారని, విచారణ వేగవంతం అయ్యేలా చూస్తామని హామీ ఇచ్చినట్లు వెల్లడించారు. ‘‘ఎంపీ రఘురామరాజుకు చెందిన ఇండ్ భారత్ థర్మల్ పవర్ ప్రైవేట్ లిమిటెడ్‌కు సంబంధించి రూ. 826 కోట్ల బ్యాంకు ఫ్రాడ్ కేసులో తీవ్ర జాప్యం జరుగుతోందని నేను రాసిన లేఖకు కేంద్ర ఆర్థిక మంత్రి శ్రీమతి నిర్మలా సీతారామన్ గారు స్పందించారు. విచారణ వేగవంతం అయ్యేలా చూస్తామని తెలిపారు.’’ అని విజయసాయిరెడ్డి పేర్కొన్నారు.