గురువారం, 28 మార్చి 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By జెఎస్కె
Last Modified: బుధవారం, 4 ఆగస్టు 2021 (14:59 IST)

లేపాక్షి నాలెడ్జ్ హబ్ కేసులో గ‌డువు కోరిన జ‌గ‌న్, విజ‌య‌సాయి

లేపాక్షి నాలెడ్జ్ హబ్ కేసులో డిశ్చార్జ్ పిటిషన్ల దాఖలుకు ఏపీ సీఎం జ‌గ‌న్, ఎంపీ విజ‌య‌సాయి రెడ్డిలు కోర్టును గడువు కోరారు. మ‌రోప‌క్క గీతారెడ్డి, శామ్యూల్ పిటిషన్లపై విచారణ 16కు వాయిదా ప‌డింది.

లేపాక్షి నాలెడ్జ్ హబ్ కేసులో ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి, రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి, జగతి పబ్లికేషన్స్ సంస్థ ప్రతినిధులు ఆరోపణలు ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే. ఈ కేసులో డిశ్చార్జ్ పిటిషన్ల దాఖలుకు తమకు మరింత గడువు కావాలని జగన్, విజయసాయిరెడ్డి నిన్న సీబీఐ కోర్టును అభ్యర్థించారు. 
 
ఇదే కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న మాజీ మంత్రి గీతారెడ్డి, మాజీ ఐఏఎస్ శామ్యూల్ దాఖలు చేసిన పిటిషన్లపై విచారణ ఈ నెల 16కు వాయిదా పడింది. మరోవైపు, రాంకీ కేసులో మూడో నిందితుడైన అయోధ్యరామిరెడ్డి దాఖలు చేసిన డిశ్చార్జ్ పిటిషన్లపై నిన్న సీబీఐ కోర్టులో వాదనలు జరిగాయి. ఈ కేసులో తదుపరి విచారణ ఈ నెల 12కు వాయిదా పడింది. 
 
అలాగే, వాన్‌పిక్ దాల్మియా, అరబిందో-హెటిరో, జగతి పబ్లికేషన్స్ కేసుల విచారణ కూడా ఈ నెల 12కు వాయిదా పడింది. ఇందూ హౌసింగ్ బోర్డు కేసును కోర్టు ఈ నెల 17కు వాయిదా వేసింది. హైకోర్టులో స్టేలు లేని నిందితుల అభియోగాల విషయంలో వాదనలకు సిద్ధంగా ఉండాలని కోర్టు స్పష్టం చేసింది.