1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By సెల్వి
Last Updated : బుధవారం, 2 డిశెంబరు 2020 (18:01 IST)

ప్రేమోన్మాదం, నన్ను ప్రేమిస్తావా లేదా అంటూ యువతి మెడపై కత్తితో దాడి చేసిన ఉన్మాది

గాజువాక యువతి హత్యోదంతం మరవకముందే విశాఖపట్నంలో మరో దారుణ ఘటన చోటుచేసుకుంది. ఫెర్రీ జంక్షన్‌లో వద్ద ఓ యువతిపై శ్రీకాంత్‌ అనే యువకుడు కత్తితో దాడి చేశాడు. ఈ ఘటన స్థానికంగా కలకలం సృష్టించింది. విశాఖ ఫెర్రీ వీధికి చెందిన ప్రియాంక అనే యువతిపై ఇంటి పక్కనే ఉండే శ్రీకాంత్‌ అనే యువకుడు కత్తితో దాడి చేశాడు. 
 
దాడి అనంతరం ఆమె తల్లిదండ్రులతో విషయం చెప్పాడు. వారితో మాట్లాడుతూనే అదే కత్తితో తనను తాను గాయపరచుకున్నాడు. వెంటనే స్థానికులు యువతీ యువకులిద్దరిని విశాఖ కింగ్‌జార్జ్‌ హాస్పిటల్‌కు తరలించారు. యువతి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు. 
 
ప్రస్తుతం ఈఎన్‌టీ వైద్యుల పర్యవేక్షణలో ప్రియాంకకు చికిత్స అందుతోంది. ఆమె గొంతు దగ్గర గాయం కావడంతో తీవ్ర రక్తస్రావమైంది. ఆమెను శ్రీకాంత్ ప్రేమిస్తున్నట్టుగా సమాచారం. ప్రియాంక సచివాలయంలో వాలంటీర్‌గా పని చేస్తోంది.
 
మరో యువకుడితో చనువుగా ఉంటుందన్న అనుమానంతో శ్రీకాంత్ దాడి చేసినట్టుగా తెలుస్తోంది. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.