శుక్రవారం, 19 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By
Last Updated : గురువారం, 28 ఫిబ్రవరి 2019 (15:20 IST)

బాబాయ్‌కు హ్యాండిచ్చిన అబ్బాయ్... జగన్‌కు షాకిచ్చే పనిలో వైవీ సుబ్బారెడ్డి

తన బాబాయ్ వైపీ సుబ్బారెడ్డికి వైకాపా అధినేత జగన్ మోహన్ రెడ్డి తేరుకోలేని షాకిచ్చారు. దీంతో అబ్బాయికి గట్టి షాకివ్వాలన్న పట్టుదలతో వైవీ సుబ్బారెడ్డి ఉన్నట్టు విశ్వసనీయ వర్గాల సమాచారం. 
 
నిజానికి బుధవారం వైకాపా అధినేత జగన్ మోహన్ రెడ్డి గుంటూరు జిల్లా తాడేపల్లిలో నిర్మించుకున్న కొత్త ఇంట్లోకి ప్రవేశించారు. ఈ గృహ ప్రవేశానికి వైవీ సుబ్బారెడ్డి హాజరుకాలేదు. పార్టీలో అత్యంత కీలకంగా ఉండే నేతల్లో ఒకరైన ఈయన.. జగన్‌ ఇంటి గృహప్రవేశానికి హాజరుకాకపోవడం పలు అనుమానాలకు దారితీసింది. 
 
వైవీ సుబ్బారెడ్డి పార్టీ నేత మాత్రమే కాదు. స్వయంగా బాబాయి కూడా. వైఎస్ఆర్, వైవీ సుబ్బారెడ్డిలు తోడల్లుళ్లు. అలాంటి వైవీ ఈ వేడుకకు గైర్హాజరు కావడం సరత్రా చర్చనీయాంశమైంది. అబ్బాయి జగన్‌పై బాబాయ్‌ అలకే దీనికి కారణమని పార్టీలో చర్చ జరుగుతోంది.
 
ప్రస్తుతం ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్న ఒంగోలు లోక్‌సభ టికెట్‌ను ఈసారి ఇచ్చేది లేదని... టీడీపీకి చెందిన మాగుంట శ్రీనివాసరెడ్డికి ఇస్తున్నానని జగన్‌ నిర్మొహమాటంగా చెప్పినట్లు తెలుస్తోంది. 'మాగుంటకు మాట ఇచ్చాను' అని జగన్‌ చెప్పడంతో వారిద్దరి మధ్య దూరం పెరిగిందని చెబుతున్నాయి. అదేసమయంలో ఒంగోలు అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేయాల్సిందిగా చిన్నాయనకు జగన్ సూచించినట్టు సమాచారం. 
 
గత 2014 ఎన్నికల్లో వైవీ సుబ్బారెడ్డి ఒంగోలు ఎంపీ స్థానం నుంచి పోటీ చేశారు. టీడీపీ తరపున పోటీచేసిన మాగుంటపై విజయం సాధించారు. ఇప్పుడు... మాగుంటను వైసీపీ జిల్లా అధ్యక్షుడు బాలినేని శ్రీనివాసరెడ్డి పార్టీలోకి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారని.. ఒంగోలు లోక్‌సభ సీటు ఇచ్చేందుకు జగన్‌ సుముఖత వ్యక్తం చేశారని సమాచారం. దీంతో వారి మధ్య దూరం పెట్టిందని తెలుస్తోంది.