1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : శుక్రవారం, 18 మార్చి 2022 (10:52 IST)

ఈ నెల 21వ తేదీన మూడు రాజధానులపై బిల్లు?

మూడు రాజధానుల అంశంలో రాష్ట్ర సర్వోన్నత న్యాయస్థానం నుంచి చుక్కెదురైనప్పటికీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం మాత్రం ఏమాత్రం వెనక్కి తగ్గేలా కనిపించడం లేదు. మూడు రాజధాలను అంశంలో ముందుకే వెళ్లాలని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి భీష్మించి కూర్చొన్నట్టుగా తెలుస్తోంది. 
 
ఇందులోభాగంగా ఈ నెల 21వ తేదీన మూడు రాజధానుల బిల్లును ప్రవేశపెట్టాలని ఆయన నిర్ణయించినట్టు సమాచారం. ఈ అంశాన్ని సోషల్ డెమోక్రటిక్ ఫ్రంట్ రాష్ట్ర అధ్యక్షుడు మాదిగాని గుర్నాథం వెల్లడించారు. ఈ నెల 21వ తేదీ మూడు రాజధానులపై శాసనసభలో చర్చించి బిల్లు ప్రవేశపెడుతామని సీఎం జగన్ తమకు చెప్పారని వెల్లడించారు. 
 
బహుజన పరిరక్షణ సమితి మూడు రాజధానులకు సంపూర్ణ మద్దతు తెలిపింది. ఇదే అంశంపై సీఎంకు విజ్ఞప్తి చేసేందుకు ఆ సమితి నేతలు గుర్నాథం, సాంబయ్య. ఆదాం తదితరులు గురువారం ఏపీ మంత్రి ఆదిమూలపు సురేష్‌తో కలిసి సీఎం జగన్‌ను కలిశారు. ఈ సందర్భంగా వారు మూడు రాజధానుల బిల్లును అసెంబ్లీలో పెట్టాలని సీఎం జగన్‌కు ఒక వినతిపత్రం సమర్పించారు. 
 
ఇదే అశంపై గుర్నాథం మాట్లాడుతూ, అసెంబ్లీలో మూడు రాజధానుల బిల్లును ప్రవేశపెట్టాలని సీఎం జగన్‌కు వినతిపత్రం అందజేసినట్టు చెప్పారు. ఆయన కూడా సానుకూలంగా స్పందించి ఈ నెల 21వ తేదీన అసెంబ్లీలో బిల్లును ప్రవేశపెడతామని తమకు హామీ ఇచ్చారని గుర్నాథం వెల్లడించారు.