శనివారం, 27 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : శుక్రవారం, 8 జులై 2022 (13:53 IST)

నా కుమార్తెకు అండగా ఉండాలి.. అందుకే తప్పుకుంటున్నా.. వైఎస్ విజయమ్మ

ys vijayamma
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గౌరవాధ్యక్ష పదవికి వైఎస్ విజయమ్మ రాజీనామా చేశారు. శుక్రవారం గుంటూరు వేదికగా జరుగుతున్న ఆ పార్టీ ప్లీనరీ సమావేశాల్లో తొలి రోజున ఆమె వేదికపై నుంచి ఈ విషయాన్ని ప్రకటించారు. 
 
ఈ ప్లీనరీ సమావేశాలు రెండు రోజుల పాటు జరుగనున్నాయి. ఇందులో విజయమ్మ ప్రారంభ ప్రసంగం చేస్తూ, తన కుమార్తె తెలంగాణా రాష్ట్రంలో కొత్త పార్టీని స్థాపించి ఇపుడు ఒంటరి పోరాటం చేస్తున్నారని, ఆమెకు అండగా నిలబడేందుకు పార్టీ గౌరవాధ్యక్ష పదవికి రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించారు. 
 
అంతేకాకుండా, తన బిడ్డ జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల ఆదరాభిమానాలు అందుకున్నారని, ఆయన్ను మీ చేతుల్లో పెడుతున్నట్టు ప్రకటించారు. అయితే, ఒక తల్లిగా జగన్‌కు ఎల్లవేళలా అండగా ఉంటానని తెలిపారు. కుటుంబంలో మనస్పర్థలు ఉన్నాయంటూ తప్పుడు ప్రచారం చేస్తున్నారని, వీటికి ముగింపు పలికేందుకే పార్టీకి రాజీనామా చేస్తున్నట్టు ఆమె ప్రకటించారు. 

తూర్పుపడమరగా అన్నాచెల్లెలు  
దివంగత మహానేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి 73వ జయంతి వేడుకలను శుక్రవారం వైకాపా పార్టీ శ్రేణులు ఘనంగా జరుపుకుంటున్నాయి. ఈ వేడుకలను పురస్కరించుకుని కడప జిల్లా ఇపుడుపులపాయలోని వైఎస్ఆర్ ఘాట్‌కు ఏపీ ముఖ్యమంత్రి, వైకాపా అధినేత జగన్మోహన్ రెడ్డి నివాళులు అర్పించారు. ఆయన వెంట తల్లి, వైఎస్ భార్య విజయలక్ష్మి, భార్య భారతీరెడ్డిల ఉన్నారు. 
 
అంతేకాకుండా, తన తండ్రికి నివాళులు అర్పించేందుకు వైఎస్ తెలంగాణ పార్టీ అధినేత్రి వైఎస్. షర్మిల కూడా ఇడుపులపాయకు వచ్చారు. ఈ సందర్భంగా అన్నా చెల్లెళ్లు ఎదురెదురు పడినప్పటికీ ఒకరినొకరు పలుకరించుకోలేదు. నివాళులర్పించక ముందు కానీ.. ఆ తర్వాత కానీ.. జగన్‌, షర్మిల ఒకరినొకరు పలకరించుకోలేదు. కార్యక్రమం పూర్తయిన తర్వాత ఎవరికి వారు ఘాట్‌ నుంచి వెళ్లిపోయారు.