1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By వరుణ్
Last Updated : బుధవారం, 25 జనవరి 2023 (11:39 IST)

ట్రంకు పెట్టెల్లో హైదరాబాద్ సీబీఐ కోర్టుకు తరలిన వివేకా హత్య కేసు ఫైళ్ళు

వైకాపా సీనియర్ నేత, మాజీ మంత్రి వైఎస్.వివేకానంద రెడ్డి హత్య కేసుకు సంబంధించిన ఫైళ్లను సీబీఐ అధికారులు ప్రత్యేక భద్రతతో హైదరాబాద్ నగరంలోని సీబీఐ కోర్టుకు తరలించారు. మొత్తం మూడు ట్రంకు పెట్టెల్లో ఈ ఫైళ్ళను తరలించారు. ఏపీలో సాగుతూ వచ్చిన ఈ కేసు విచారణను సుప్రీంకోర్టు తెలంగాణ రాష్ట్రానికి బదిలీ చేసిన విషయం తెల్సిందే.
 
ఈ నేపథ్యంలో మంగళవారం కీలక పరిణామం చోటుచేసుకుంది. వివేకా హత్య కేసు ఫైళ్లు, చార్జిషీటు పత్రాలు, సాక్షుల వాంగ్మూలాలు, ఇతర కీలక డాక్యుమెంట్లను హైదరాబాద్ నగరంలోని సీబీఐ కోర్టుకు తరలించారు. వీటిని కడప జిల్లా సెషన్స్ కోర్టు నుంచి గట్టి భద్రత మధ్య హైదరాబాద్‌కు తరలించారు. మొత్తం మూడు ట్రంకు పెట్టెల్లో పంపించారు. 
 
కాగా, వివికే హత్య కేసును విచారిస్తున్న సీబీఐ.. కడప కోర్టులో ఐదుగురు నిందితులకు సంబంధించి రెండు చార్జిషీట్లను దాఖలు చేయగా, ఇపుడు వీటిని హైదరాబాద్ నగరానికి తరలించారు. కాగా, ఈ కేసు విచారణ ఇక హైదరాబాద్ సీబీఐ కోర్టులో సాగనుంది. ఇందులోభాగంగా, సీబీఐ అధికారులు కూడా దూకుడు ప్రదర్శిస్తున్నారు. 
 
ఈ కేసులో ప్రధానంగా ఆరోపణలు ఎదుర్కొంటున్న కడప ఎంపీ వైఎస్ అవినాశ్ రెడ్డికి నోటీసులు జారీచేసింది. దీంతో ఆయన హైదరాబాద్ నగరంలోని సీబీఐ కార్యాలయంలో విచారణకు హాజరుకావాల్సివుంది. ఈ కేసులో సీబీఐ అధికారులు ఆయన్ను అరెస్టు చేసే అవకాశం ఉందనే ప్రచారం సాగుతోంది. ఇది వైకాపాలో ప్రకంపనలు రేపుతోంది.