1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. బిబిసి తెలుగు
Written By బిబిసి
Last Modified: శనివారం, 8 ఏప్రియల్ 2023 (16:34 IST)

మేం తెలంగాణకు ఎంతో చేస్తున్నా రాష్ట్ర ప్రభుత్వం నుంచి సహకారం లేదు: ప్రధాని మోదీ

Modi
సికింద్రాబాద్‌లో వందేభారత్ రైలు ప్రారంభించిన అనంతరం వివిధ అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేసిన ప్రధాని మోదీ అక్కడి నుంచి పరేడ్ గ్రౌండ్‌కి వెళ్లి అక్కడ బహిరంగ సభలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... కేంద్ర ప్రభుత్వం తెలంగాణలో అభివృద్ధి పనుల కోసం చేస్తున్న ఖర్చు వివరాలు తెలిపారు. కేంద్రం చేపడుతున్న అభివృద్ధి పనులకు తెలంగాణ ప్రభుత్వం ఆటంకాలు కల్పిస్తోందని మోదీ అన్నారు.
 
‘మా ప్రభుత్వం దేశవ్యాప్తంగా 7 మెగా టెక్స్ టైల్ పార్కులు ఏర్పాటుచేయనుంది. అందులో ఒకటి తెలంగాణలో వస్తుంది. ఈ టెక్స్‌టైల్ పార్కుతో యువతకు ఉపాధి లభిస్తుంది. తెలంగాణలో విద్య, ఆరోగ్య రంగాలపైనా కేంద్రం పెట్టుబడులు పెడుతోంది అన్నారు మోదీ. అయితే, రాష్ట్ర ప్రభుత్వం నుంచి సహకారం అందకపోవడం వల్ల ప్రతి ప్రాజెక్టులో జాప్యం జరుగుతోందని మోదీ అన్నారు.
 
‘రాష్ట్ర ప్రభుత్వం నుంచి సహకారం లేకపోవడం వల్ల అభివృద్ధి పనుల్లో జాప్యం జరుగుతుంది. ప్రజలకు నష్టం జరుగుతుంది. అభివృద్ధి పనులకు ఆటంకం కలిగించవద్దని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతున్నాను’ అన్నారు మోదీ.