1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. బిబిసి తెలుగు
Written By బిబిసి
Last Modified: మంగళవారం, 21 జూన్ 2022 (22:43 IST)

ద్రౌపది ముర్ము: రాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్‌డీఏ అభ్యర్థిగా జార్ఖండ్ మాజీ గవర్నర్ పేరును ప్రకటించిన జె.పి. నడ్డా

Murmu
రాష్ట్రపతి ఎన్నికల్లో అధికార ఎన్‌డీఏ అభ్యర్థిగా జార్ఖండ్ మాజీ గవర్నర్‌ ద్రౌపది ముర్ము పేరును ప్రకటించారు. బీజేపీ అధ్యక్షుడు జె.పి.నడ్డా మంగళవారం రాత్రి దిల్లీలో ఈ విషయాన్ని ప్రకటించారు.


‘‘మొట్టమొదటిసారి ఒక గిరిజన మహిళా అభ్యర్థికి ప్రాధాన్యం ఇచ్చాం. రాబోయే రాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్‌డీఏ అభ్యర్థిగా ద్రౌపది ముర్మును ప్రకటిస్తున్నాం’’ అని ఆయన చెప్పారు. ఈ ప్రకటన చేయటానికి ముందు బీజేపీ పార్లమెంటరీ బోర్డు దిల్లీలోని పార్టీ ప్రధాన కార్యాలయంలో సమావేశమైంది.

 
ప్రధానమంత్రి నరేంద్రమోదీ, పార్టీ అధ్యక్షుడు జె.పి.నడ్డా, రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, కేంద్ర హోంమంత్రి అమిత్ షా, కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ తదితర నేతలు ఈ భేటీకి హాజరయ్యారు. ఒడిషాకు చెందిన గిరిజన మహిళ అయిన ద్రౌపది ముర్ము రాష్ట్రపతి ఎన్నికల్లో ప్రతిపక్షాల ఉమ్మడి అభ్యర్థి యశ్వంత్ సిన్హాతో పోటీ పడనున్నారు. ఒడిషాలో బీజేపీ, బిజూ జనతా దళ్ సంకీర్ణ ప్రభుత్వంలో 2000 నుంచి 2004 సంవత్సరాల మధ్య ద్రౌపది ముర్ము రాష్ట్ర మంత్రిగా పనిచేశారు.