శనివారం, 20 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. బిబిసి తెలుగు
Written By
Last Updated : శనివారం, 7 సెప్టెంబరు 2019 (20:41 IST)

చంద్రయాన్-2: సొంత మంత్రినే తిట్టిపోస్తున్న పాకిస్తానీలు.. ఫవాద్ హుస్సేన్ చౌధరిపై వెల్లువెత్తిన ట్రోల్స్

ఇస్రో చంద్రయాన్-2 ప్రయోగం గురించి చులకనగా మాట్లాడిన పాకిస్తాన్ సైన్స్, టెక్నాలజీ మంత్రి ఫవాద్ హుస్సేన్‌ను సోషల్ మీడియాలో సొంత దేశం వారే తిట్టిపోస్తున్నారు. చంద్రయాన్-2 ప్రయోగాన్ని భారత్ ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన సంగతి తెలిసిందే. ఆర్బిటార్, ల్యాండర్, రోవర్‌లతో కూడిన వ్యోమనౌక దాదాపు 47 రోజులు ప్రయాణించి చంద్రుడి వద్దకు చేరుకుంది.

 
శుక్రవారం అర్ధరాత్రి దాటిన తర్వాత ల్యాండర్ చంద్రుడిపై దిగాల్సి ఉంది. ఈ చరిత్రాత్మక ఘట్టాన్ని ఇస్రో శాస్త్రవేత్తలతో కలిసి వీక్షించేందుకు భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ స్వయంగా బెంగళూరులోని ఇస్రో కేంద్రానికి వెళ్లారు. అయితే, మరో 2.1 కి.మీ.లు కిందకు వెళ్తే చంద్రుడిపై ల్యాండర్ దిగుతుందనగా.. దానితో ఇస్రో కమ్యునికేషన్ కోల్పోయింది. అయితే, దీనిపై నిరూత్సాహపడాల్సిన అవసరం లేదని, ఏ ప్రయోగంలోనైనా ఎత్తు పల్లాలు సహజమని ప్రసంగం చేసి మోదీ ఇస్రో శాస్త్రవేత్తల వెన్నుతట్టారు.

 
సోషల్ మీడియాలోనూ ఇస్రో శాస్త్రవేత్తల కృషిని చాలా మంది అభినందించారు. వారికి మద్దతుగా లక్షల సంఖ్యలో ట్వీట్లు వెల్లువెత్తాయి. #IndiaWithISRO #ProudOfISRO తదితర హ్యాష్‌ట్యాగ్‌లు ట్రెండ్ అయ్యాయి. అయితే, ఇస్రో ప్రయోగం గురించి పాకిస్తాన్ సాంకేతికశాఖ మంత్రి ఫవాద్ హుస్సేన్ చులకనగా #IndiaFailed అనే హ్యాష్‌ట్యాగ్‌తో పలు ట్వీట్లు చేశారు.

 
''కమ్యూనికేషన్ వ్యవస్థలపై మోదీజీ ప్రసంగం ఇస్తున్నారు. ఆయన నాయకుడు కాదు ఓ వ్యోమగామి. పేద దేశానికి చెందిన రూ.900 కోట్లను వృథా చేసినందుకు లోక్‌సభ ఆయన్ను నిలదీయాలి'' అని ఫవాద్ వ్యాఖ్యానించారు. ''చంద్రయాన్ లాంటి పిచ్చి ప్రయోగాల కోసమో, అభినందన్ లాంటి ఇండియట్స్‌ను టీ కోసం ఎల్‌ఓసీ అవతలకు పంపేందుకో డబ్బులు తగలేయకుండా, పేదరిక నిర్మూలన కోసం పనిచేయండి. కశ్మీర్‌లోనూ చంద్రయాన్ లాంటి ఫలితమే వస్తుంది. కాకపోతే అందుకయ్యే ఖర్చు చాలా ఎక్కువ ఉండబోతుంది'' అని మరో ట్వీట్‌లో అన్నారు.

 
దీంతో ఫవాద్ ట్వీట్లపై సహజంగానే భారతీయులు తీవ్రంగా మండిపడ్డారు. కానీ, ఆయనకు పాకిస్తానీల చీవాట్లూ తప్పలేదు. ''చంద్రుడిపైకి వెళ్లడం తర్వాత.. మనకు ఒక నగరం నుంచి మరో నగరానికి తీసుకువెళ్లే ఎయిర్‌లైన్స్ కూడా సరిగ్గా లేదు. అంకుల్.. ప్లీజ్ కూర్చొండి'' అని దానికా కమల్ అనే పాకిస్తానీ మహిళ ట్వీట్ చేశారు. 

 
''ఇది చాలా అభ్యంతరకరం. పైగా ఇలాంటి సమయంలో. మంత్రులకు ఇంకాస్త పరిపక్వత ఉంటే బాగుండేది'' అని అల్‌జజీరా కోసం పనిచేస్తున్న అలియా చుగ్తాయీ అనే పాకిస్తానీ పాత్రికేయురాలు ట్వీట్ చేశారు. ''చంద్రయాన్ క్రాష్‌ల్యాండింగ్ గురించి పరిహాసం ఆడటం.. లోకల్ యునివర్సిటీ డ్రౌపౌట్‌ను, హార్వర్డ్ ‌డ్రాపౌట్‌తో పోల్చడమే. చంద్రుడిపైకి చేరుకునే రేసులో మనం లేనే లేము. మన స్పేస్ ప్రొగ్రామ్‌ను మెరుగుపరుచుకోవడంపై దృష్టి పెడితే మంచిది'' అని జిబ్రాన్ నసీర్ అనే యూజర్ ట్వీట్ చేశారు.

 
''అల్లా కోసమైన ఆగండి. మీరు సైన్స్, టెక్నాలజీ మంత్రి. చంద్రయాన్‌పై భారత్‌కు పాఠాలు చెప్పే బదులు, భారత్ కన్నా ముందు మనం చంద్రుడిపైకి ఎప్పుడు వెళ్తామో చెప్పండి. దీన్నో అవకాశంలా చూడండి'' అని అత్లాఫ్ భట్ అనే పాకిస్తానీ ట్వీట్ చేశారు. ''మనమంతా వారిని చులకన చేసి మాట్లాడుతున్నాం. కానీ, నిజం ఒప్పుకోవాల్సిందే. వాళ్లు ప్రయత్నించారు. వైఫల్యాన్ని ఒప్పుకునేంత ధైర్యం వారికి ఉంది. మన ఖండం వరకూ ఇదొక గొప్ప విజయం'' అని హమ్మాద్ అజీజ్ అనే పాకిస్తానీ వ్యాఖ్యానించారు.

 
''చూడండి మన సైన్స్, టెక్నాలజీ మంత్రి ఏమంటున్నారో. చంద్రుడిపైకి వెళ్లేందుకు ప్రయత్నించడం పిచ్చి ప్రయోగమట. డబ్బులు తగలయేడమట'' అని మహమ్మద్ వసీం అనే పాకిస్తానీ విమర్శించారు. ''సైంటిఫిక్ కమ్యునిటీలో భాగంగా ఈ విజయవంతమైన మిషన్‌ పట్ల ఇస్రోను నేను అభినందిస్తున్నా. ఇస్రో విఫలమైంది. కానీ, ఇది చాలా సంక్లిష్టమైన ప్రాజెక్టు. తదుపరి ప్రణాళికల కోసం ఉపయోగపడే కీలక డేటా వారికి దీని ద్వారా లభించింది'' అని కాషీఫ్ ఇనాయత్ అనే పాకిస్తానీ తమ దేశ సైన్యం అధికార ప్రతినిధి మేజర్ జనరల్ ఆసిఫ్ గఫూర్ ట్వీట్‌పై స్పందించారు. అయితే, తన వ్యాఖ్యలను తప్పుపడుతున్న పాకిస్తానీలపై ఫవాద్ మండిపడ్డారు.