1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. బిబిసి తెలుగు
Written By బిబిసి
Last Modified: శనివారం, 11 ఏప్రియల్ 2020 (17:25 IST)

కరోనావైరస్: కాంటాక్ట్ అయినవారిని గుర్తించేందుకు చేతులు కలిపిన గూగుల్, యాపిల్

కరోనావైరస్ సోకినవారితో ప్రత్యక్షంగా మెలగినవారిని గుర్తించి అప్రమత్తం చేసే ఒక టెక్నాలజీని యాపిల్, గూగుల్‌లు సంయుక్తంగా అభివృద్ధి చేస్తున్నాయి. స్మార్ట్‌ఫోన్ బ్లూటూత్ సంకేతాల సహాయంతో ఈ కాంటాక్ట్ ట్రేసింగ్ టెక్నాలజీ పనిచేస్తుంది. బ్లూటూత్ సంకేతాల ఆధారంగా ఆ స్మార్ట్ ఫోన్ వాడుతున్న వ్యక్తి ఇంకెవరైనా కోవిడ్-19 బాధితులకు సమీపంగా మెలగారా అన్నది గుర్తిస్తారు.

 
అలా గుర్తించి ఆ స్మార్ట్‌ఫోన్ యజమానికి సందేశం పంపిస్తారు. ఈ క్రమంలో జీపీఎస్ లొకేషన్ కానీ, వ్యక్తిగత డాటా కానీ గూగుల్, యాపిల్ సంస్థలు రికార్డు చేయబోవు.

 
17 లక్షలు దాటిన కోవిడ్-19 కేసులు
ప్రపంచవ్యాప్తంగా కరోనావైరస్ బారిన పడ్డ వారి సంఖ్య 17 లక్షలకు చేరుకుంది. ఇప్పటివరకూ 1,02,867 మంది మరణించారు. 3,77,434 మంది వైరస్ నుంచి పూర్తిగా కోలుకున్నారు. ప్రపంచవ్యాప్తంగా 185 దేశాలు, ప్రాంతాలు కరోనావైరస్ బారిన పడ్డాయి.

 
అమెరికా ఈ వైరస్ ధాటికి అతలాకుతలం అవుతోంది. ఇప్పటి వరకూ ఈ ఒక్క దేశంలోనే 5 లక్షల కేసులు నమోదుకాగా, 18,700 మందికి పైగా ప్రజలు మరణించారు. బాధితుల సంఖ్య పరంగా అమెరికా తర్వాత స్థానంలో స్పెయిన్, ఇటలీ, ఫ్రాన్స్, జర్మనీ, చైనాలున్నాయి. స్పెయిన్‌లో 16వేల మంది మరణించగా, ఇటలీలో 18,800కు పైగా దీని బారిన పడి ప్రాణాలు కోల్పోయారు.

 
వైరస్ ప్రారంభమైన చైలో ఇప్పటివరకూ 83 వేల కేసులు నమోదుకాగా, 3,300 మంది మరణించారు.