శుక్రవారం, 29 మార్చి 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. బిబిసి తెలుగు
Written By బిబిసి
Last Modified: శుక్రవారం, 6 జనవరి 2023 (21:02 IST)

దిల్లీ: కారుతో 12 కిలోమీటర్లు ఈడ్చుకెళ్ళి చంపేసింది ఈ అమ్మాయినే

Anjali singh
దిల్లీలో జరిగిన భయానక హిట్ అండ్ రన్ కేసులో ప్రాణాలు కోల్పోయిన 20 ఏళ్ల యువతి అంజలి సింగ్‌ను గుర్తుకు చేసుకుంటూ ఆమె కుటుంబ సభ్యులు తీవ్ర భావోద్వేగానికి లోనయ్యారు. ఇన్‌స్టాగ్రామ్ రీల్స్ చేయడాన్ని ఎక్కువగా ఇష్టపడే అంజలి సింగ్, ఎల్లప్పుడూ నవ్వుతూ, నవ్విస్తూ ఉండేదని, పిల్లలతో ఆడుకోవడమంటే ఆమెకు చాలా ఇష్టమని వారు గుర్తు చేసుకున్నారు. ఈ కఠిన శీతాకాలం అర్థరాత్రి ఒక యువతి కలలు ఎలా అర్ధంతరంగా ముగిశాయో బీబీసీ ప్రతినిధి దిల్‌నవాజ్ పాషా ఈ కథనంలో వివరించారు.

 
ప్రస్తుతం అంజలి సింగ్ డీయాక్టివేట్ చేసిన ఇన్‌స్టాగ్రామ్ ప్రొఫైల్‌లో, ఆమె మెరిసే వస్త్రాలు ధరించి డ్యాన్సులు చేస్తున్న వీడియోలను అప్‌లోడ్ అయి ఉన్నాయి. అలాగే పాపులర్ బాలీవుడ్ పాటలకు లిప్ సింక్ చేస్తూ వీడియోలు పోస్ట్ చేసేవారు. కానీ, ఆ వీడియోలకు భిన్నంగా ఆమె నిజ జీవితంలో విషాదంగా ముగిసింది. అంజలి ఒక్కరే ఆ కుటుంబానికి ఆధారం. ఆమె తన సంపాదనతోనే కుటుంబాన్ని నడిపేవారు. ఆర్థికంగా వెనుకబడిన ప్రజలకు ప్రభుత్వం అందిస్తున్న ఉచిత ఆహార పథకం ద్వారా వారికి పూటగడుస్తోంది.

 
చుట్టుపక్కల ఉన్న మహిళలకు మేకప్ వేస్తూ అంజలి కొంత సంపాదించేవారు. పెళ్లిళ్లు, ఇతర కార్యక్రమాల్లో చిన్న చిన్న పనులు చేస్తూ మరికొంత ఆర్జించేవారు. ఎంత కష్టం వచ్చినా, ఎప్పుడూ తాము ఆశను వదులుకోలేదని అంజలి తల్లి రేఖ చెప్పారు. ఇప్పటి వరకూ అలాగే ఉన్నామని ఆమె అన్నారు. కొత్త సంవత్సరం తొలి రోజు తెల్లవారుజామున దిల్లీలో హిట్ అండ్ రన్ కేసులో అంజలి చనిపోయారు. స్కూటర్‌పై వెళ్తున్న ఆమెను ఒక కారు ఢీకొట్టింది. ఆమెను గుద్దిన తర్వాత, కారులో ఉన్న ఐదుగురు భయాందోళనలకు గురయ్యారని పోలీసులు చెప్పారు. దీంతో వారు కారును ఆపకుండా అలానే 12 కిలోమీటర్లు ఆమెను ఈడ్చుకెళ్లారని తెలిపారు. ఈ ప్రమాదంలో అంజలి మరణించింది.ప్రస్తుతం ఈ ఐదుగురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.  

 
చిన్న వయసులోనే కుటుంబ బాధ్యత
పోస్టు మార్టం నివేదిక ప్రకారం అంజలి తలకు తీవ్రమైన దెబ్బతగిలి రక్తస్రావం కావడం, వెన్నెముక దెబ్బతినడమే ఆమె మృతికి ప్రాథమిక కారణాలుగా కనిపిస్తున్నాయి. అయితే, దళిత సామాజికవర్గానికి చెందిన అంజలి కుటుంబం సభ్యులు ఆమెపై అత్యాచారం జరిగిందని ఆరోపిస్తుంది. మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్న సమయంలో ఆమె నగ్నంగా ఉందని వారు అంటున్నారు. అయితే, ఆమెపై అత్యాచారం జరిగినట్లు పోస్టుమార్టం నివేదికలో లేదని పోలీసులు తెలిపారు. విచారణ జరుగుతున్న ఈ సమయంలో, అసలు ఆ రాత్రి అంజలికి ఏం జరిగిందని ఆమె బంధువులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

 
అంజలి కుటుంబం దిల్లీలోని మంగోల్‌పురి ప్రాంతంలో ఒక గది, కిచెన్ ఉన్న చిన్న ఇంట్లో నివసిస్తోంది. ఆరుగురు సంతానంలో ఆమె రెండో అమ్మాయి. కుటుంబ పోషణ కోసం ఆమె చిన్న వయసులోనే స్కూల్ మానేసి చిన్న చిన్న పనులు చేయడం మొదలు పెట్టారు. తల్లి రేఖ ఎనిమిదేళ్ల క్రితం భర్త చనిపోవడంతో ఒక స్కూల్‌లో పనికి చేరారు. ఆ తరువాత కరోనా లాక్‌డౌన్ సమయంలో అనారోగ్య కారణాలతో ఆ పని మానేశారు. ఆ పరిస్థితుల్లో అంజలి దగ్గర్లోని ఒక బ్యూటీ పార్లర్‌లో మేకప్ చేయడం నేర్చుకున్నారని, పెళ్లిళ్లు, ఫంక్షన్లలో మేకప్ చేస్తూ డబ్బు సంపాదిస్తూ కుటుంబ అవసరాలు తీర్చడం మొదలు పెట్టారు.

 
ఆమె అక్కాచెల్లెళ్లలో ఇద్దరికి పెళ్లైంది. కానీ, తన తమ్ముళ్లు స్థిరపడిన తర్వాతనే తాను పెళ్లి చేసుకుంటానని అంజలి చెప్పిందని రేఖ అన్నారు. వారిప్పుడు స్థానిక ప్రభుత్వ పాఠశాలలో చదువుకుంటున్నారు. చేసుకోబోయే వ్యక్తి తమ కుటుంబంతో కలిసి ఉండేందుకు ఒప్పుకుంటేనే పెళ్లి చేసుకుంటానని అంజలి చెప్పేదని, అప్పుడు కుటుంబాన్ని తానే చూసుకోవడం కొనసాగించవచ్చని భావించిందని రేఖ చెప్పారు. ఎన్ని కష్టాలు ఎదురైనా అంజలి నిత్యం నవ్వుతూ, నవ్విస్తూ ఉండేదని రేఖ చెప్పారు. ‘‘అంజలి ఎప్పుడూ నవ్వుతూ ఉండేది. రీల్స్, వీడియోలు చేయడమంటే ఆమెకెంతో ఇష్టం. బాగా తయారయ్యేది’’ అని ఆమె తల్లి చెప్పారు.

 
అంజలి చుట్టుపక్కల వారందరికీ బాగా తెలుసని కూడా ఆమె చెప్పారు. తమ వీధుల్లో ఉండే గుంతలను పూడ్చాలని స్థానిక రాజకీయ నేతలకు తమ కూతురే ఫిర్యాదు చేసేదని అన్నారు. చనిపోవడానికి ముందు కూడా ఆమె తమ ప్రాంతంలోని డ్రైనేజీ సిస్టమ్‌ను బాగు చేయించేందుకు ప్రయత్నించిందని చెప్పారు. ‘‘మా పక్కింటి వారెప్పుడూ ఆమెను మున్సిపల్ ఎన్నికల్లో నిల్చోమని ప్రోత్సహించే వారు. భవిష్యత్‌లో నిల్చుంటానని ఆమె వారికి వాగ్దానం చేసింది కూడా’’ అని రేఖ కన్నీళ్ళ పర్యంతమవుతూ చెప్పారు. అయిదేళ్ల  క్రితం అంజలి రుణం తీసుకుని, సొంతంగా స్కూటర్ తీసుకుందని, ఆ స్కూటర్‌పైనే తాను ప్రయాణించేదని ఆ తల్లి వివరించారు. ఆ లోన్ కూడా దాదాపు పూర్తిగా చెల్లించారు. ఆ స్కూటర్ మీదే న్యూ ఇయర్ మొదటి రోజు ఇంటికి తిరిగొస్తూ ఆమె ప్రాణాలు కోల్పోయారు.