శనివారం, 20 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. బిబిసి తెలుగు
Written By బిబిసి
Last Updated : సోమవారం, 30 మే 2022 (13:52 IST)

‘రాజ్యసభ పదవికి నేను అర్హురాలిని కాదా?’- కాంగ్రెస్ నేత నగ్మా

రాజ్యసభ అభ్యర్థుల పేర్లు వెలువడగానే కాంగ్రెస్ పార్టీలో విభేదాలు మొదలయ్యాయి. మొదట పవన్ ఖేరా ట్వీట్ ద్వారా తన అసంతృప్తిని వ్యక్తం చేశారు. తాజాగా నగ్మా కూడా ఈ అంశంపై ట్వీట్ చేశారు. 18 సంవత్సరాల క్రితం సోనియా గాంధీ తనను రాజ్యసభకు పంపుతానని హామీ ఇచ్చారని, అది ఇప్పటికీ నెరవేరలేదని ఆమె ట్వీట్‌లో పేర్కొన్నారు.

 
‘‘2003-04లో సోనియాగాంధీ పిలుపు మేరకు నేను కాంగ్రెస్‌లో చేరినప్పుడు మా కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా స్వయంగా నన్ను రాజ్యసభకు పంపుతానని హామీ ఇచ్చారు. ఇప్పటికి 18 ఏళ్లు అవుతుంది. కానీ, వారికి నన్ను రాజ్యసభకు పంపే అవకాశమే చిక్కలేదు. మహారాష్ట్ర నుంచి ఇమ్రాన్‌ను రాజ్యసభకు పంపుతున్నారు. నాకు ఆ అర్హత లేదా?" అని ఆమె ట్వీట్‌లో ప్రశ్నించారు.

 
దీనికంటే ముందు పవన్ ఖేరా... ‘‘బహుశా నా తపస్సులో ఏదో లోపం ఉండొచ్చు’’ అని ట్వీట్ చేశారు. దీనికి బదులుగా ‘‘ఇమ్రాన్ భాయ్ ముందు నా 18 సంవత్సరాల తపస్సు కూడా వెనుకబడింది’’ అని నగ్మా మరో ట్వీట్ చేశారు. రాజ్యసభ ఎన్నికలకు 10 మంది అభ్యర్థుల పేర్లను కాంగ్రెస్ ఆదివారం రాత్రి ప్రకటించింది. పి.చిదంబరం, జైరాం రమేష్, రాజీవ్ శుక్లా, ప్రమోద్ తివారీ, ఇమ్రాన్ ప్రతాప్‌గర్హిలను కాంగ్రెస్ ఈ జాబితాలో చేర్చింది. రాజ్యసభ సీటు ఆశించి భంగపాటకు గురైన కొందరు నాయకులు బహిరంగంగా తమ అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు.