గురువారం, 19 సెప్టెంబరు 2024
  1. వార్తలు
  2. బిజినెస్
  3. వార్తలు
Written By ఠాగూర్
Last Updated : ఆదివారం, 11 ఆగస్టు 2024 (09:31 IST)

కేవలం రూ.91కే బీఎస్ఎన్ఎల్ ప్లాన్... కానీ...

bsnl
భారత ప్రభుత్వరంగ టెలికాం సంస్థ భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ (బీఎస్ఎన్ఎల్) అదిరిపోయే ప్లాన్ ఒకటి ప్రకటించింది. సిమ్ కార్డును అధిక రోజుల పాటు యాక్టివ్‌‌లో ఉంచుకునేందుకు ఈ ప్లాన్ ఎంతగానో దోహదపడనుంది. కేవలం 91 రూపాయల రీచార్జ్‌తో 90 రోజుల వ్యాలిడిటీ పొందవచ్చు. అలాగే, స్వల్ప చార్జీతో కాలింగ్, ఎస్ఎంఎస్‌లు, డేటాను ఉపయోగించుకునే వెసులుబాటును కూడా కల్పించింది. 
 
ప్రస్తుతం దేశంలోని ప్రభుత్వ రంగ టెలికాం కంపెనీలైన రిలయన్స్ జియో, ఎయిర్‌టెల్, వొడాఫోన్ ఇండియాలు ఇష్టానుసారంగా రీచార్జ్ ప్లాన్లను పెంచేస్తున్నాయి. అయితే ప్రైవేటు కంపెనీలు ఓ పక్క టారిఫ్ రేట్లు పెంచుతున్నప్పటికీ, ప్రభుత్వరంగ కంపెనీ అయిన బీఎస్ఎన్ఎల్ మాత్రం చౌక రీఛార్జ్ ప్లాన్లను ఇంకా కొనసాగిస్తూనే ఉంది. పాత ధరలకే కస్టమర్లకు ఆఫర్లు అందిస్తోంది. ప్రైవేటు టెలికం కంపెనీలు రీఛార్జ్ రేట్లు పెంచిన నేపథ్యంలో చాలా మంది వినియోగదారులు బీఎస్ఎన్ఎల్ వైపు మొగ్గుచూపుతున్నారు. కంపెనీ అందిస్తున్న ప్లాన్లను అన్వేషిస్తున్నారు. 
 
కాగా కస్టమర్లను ఆకర్షించేందుకు బీఎస్ఎన్ఎల్ ప్లాన్లు చాలానే ఉన్నాయి. అన్ని విభాగాల్లోనూ బ్రహ్మాండమైన ఆఫర్లను కంపెనీ అందిస్తోంది. రూ.100 కంటే రీఛార్జులు కూడా చాలానే ఉన్నాయి. బీఎస్ఎన్ఎల్ అందిస్తున్న ఆకర్షణీయమైన ఆఫర్లలో రూ.91 ప్లాన్ ఒకటిగా ఉంది. ఈ ప్లాన్ కింద వినియోగదారులకు 90 రోజుల వ్యాలిడిటీ లభిస్తుంది. ఇంత తక్కువ ధరలో ఇతర కంపెనీలేవీ ఈ స్థాయిలో వ్యాలిడిటీని అందించడం లేదు. 
 
తక్కువ ఖర్చుతో సిమ్ కార్డును ఎక్కువ కాలం యాక్టివ్‌గా ఉంచాలనుకునే వారికి ఈ ప్లాన్ చక్కగా ఉపయోగపడుతుంది. అయితే ఈ ప్లాన్ కింద కాలింగ్‌కు 1 నిమిషానికి 15 పైసలు ఛార్జీ పడుతుంది. 1 ఎంబీ డేటాకు 1 పైగా, ఒక ఎస్ఎంఎస్‌కు 25 పైసలు చెల్లించాల్సి ఉంటుంది. టాక్ టైమ్ వోచర్ లేదా డేటా వోచర్లతో ప్రత్యేకంగా రీఛార్జ్ చేసుకోవాల్సి ఉంటుంది. తక్కువ ధరల్లో ఈ కూపన్స్ అందుబాటులో ఉంటాయి.