శనివారం, 20 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. బిజినెస్
  3. వార్తలు
Written By ఠాగూర్
Last Updated : బుధవారం, 6 అక్టోబరు 2021 (22:18 IST)

రైల్వే ఉద్యోగులకు కేంద్రం గుడ్ న్యూస్ - 78 రోజుల బోనస్

దేశ రైల్వే శాఖలో పని చేస్తున్న ఉద్యోగులకు కేంద్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. దీపావళి బోనస్‌గా 78 రోజుల వేతనానికి సమానమైన బోనస్‌ను అందించాలని నిర్ణయించింది. ఈ మేరకు బుధవారం కేంద్ర కేబినెట్ ఆమోదముద్ర వేసింది. కేంద్రం తీసుకున్న నిర్ణయంతో ఖజానా మీద రూ.1,984.73 కోట్ల ఆర్థిక భారంపడనుంది. 
 
ఈ నిర్ణయంతో మొత్తం 11.56 లక్షల నాన్ గెజిటెడ్ రైల్వే ఉద్యోగులకు మేలు జరుగనుంది. అర్హత కలిగిన నాన్ గెజిటెడ్ రైల్వే ఉద్యోగులందరికీ ఈ ఆర్థిక సంవత్సరానికి 78 రోజులకు సమానమైన ప్రొడక్టివిటీ లింక్డ్ బోనస్ ఇవ్వనున్నట్టు కేంద్రం తెలిపింది. 
 
ప్రతి సంవత్సరం దసరా సెలవులకు ముందు ఈ బోనస్‌ను చెల్లిస్తారు. వాస్తవానికి ఫార్ములాను బట్టి 72 రోజుల వేతనాన్ని బోనస్‌గా ఇస్తారు. కానీ ఈసారి 78 రోజుల బోనస్ ఇవ్వాలని ప్రధాని నరేంద్ర మోడీ సర్కారు నిర్ణయించింది. 
 
నిజానికి కరోనా వైరస్ దేశంలో వెలుగు చూసిన తర్వాత దేశ వ్యాప్తంగా రైల్వే సేవలకు అంతరాయం ఏర్పడింది. అనేక రాష్ట్రాల్లో రైల్వే సేవలు ఇప్పటికీ పూర్తిస్థాయిలో పునరుద్ధరించలేదు. అదేసమయంలో రైల్వే ఆదాయం కూడా గణనీయంగా తగ్గింది. అయినప్పటికీ రైల్వే ఉద్యోగులకు 78 రోజుల బోనస్ ఇవ్వాలని నిర్ణయించడం గమనార్హం.