శుక్రవారం, 26 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. బిజినెస్
  3. వార్తలు
Written By ఠాగూర్
Last Updated : మంగళవారం, 31 మార్చి 2020 (16:45 IST)

కరోనా కత్తెర : అమెరికాలో 4.7 కోట్ల ఉద్యోగాలు ఉఫ్!! మరి భారత్‌లో...?

ప్రపంచాన్ని కబళించిన కరోనా వైరస్ కారణంగా ప్రపంచ ఆర్థిక వ్యవస్థ కుదేలైంది. ఈ వైరస్ మహమ్మారి బారినపడకుండా ఉండేందుకు అనేక ప్రపంచ దేశాలు సంపూర్ణ లాక్‌డౌన్‌ను అమలు చేస్తున్నాయి. దీంతో జిల్లా, రాష్ట్ర, అంతర్జాతీయ సరిహద్దులు మూతపడ్డాయి. ఇది ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపిందని ఆర్థిక నిపుణులు అభిప్రాయపడుతున్నారు. 
 
ఈ క్రమంలో ఇపుడు కరోనా వైరస్ దెబ్బకు అమెరికా కుదేలుకానుందట. దాదాపు అన్ని అధ్యయనాలు ఇదే విషయాన్ని చెబుతున్నాయి. తాజాగా ఫెడరల్ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ సెయింట్ లూయిస్ వెల్లడించిన అంచనాలు భయాందోళనలను కలిగించేలా ఉన్నాయి. 
 
కరోనా నేపథ్యంలో రెండో త్రైమాసికంలో నిరుద్యోగం 32.1 శాతానికి పెరుగుతుందని తెలిపింది. మొత్తం 4.7 కోట్ల మంది ఉద్యోగాలను కోల్పోయే పరిస్థితి ఉందని చెప్పింది. 1948 తర్వాత ఈ స్థాయిలో నిరుద్యోగ స్థాయి ఉండబోతుండటం ఇదే ప్రథమం కావడం గమనార్హం.
 
పలు రాష్ట్రాల్లో షట్ డౌన్ల కారణంగా ఇప్పటికే లక్షలాది మంది ఉద్యోగాలను కోల్పోయారు. 33 లక్షల మంది ప్రజలు నిరుద్యోగ లబ్ధి కోసం దరఖాస్తు చేసుకున్నారు. తాజా అంచనాల ప్రకారం సేల్స్, ప్రొడక్షన్, ఆహార ఉత్పత్తులు, సేవల విభాగాలలో ఎక్కువ మంది ఉద్యోగాలను కోల్పోనున్నారు. క్షురకులు, రెస్టారెంట్ సర్వర్లు, ఫ్లైట్ అటెండెంట్లు కూడా భారీగా నిరుద్యోగులుగా మారనున్నారని ఆ సంస్థ నివేదిక పేర్కొంది. 
 
మరి భారత్ మాత్రం ఇతర దేశాలతో పోల్చితే సురక్షితంగా ఉంది. ముఖ్యంగా, కరోనా వైరస్ వ్యాప్తికి అడ్డుకట్ట వేయడంలోనూ ఇతర దేశాలతో పోల్చితే ఒక అడుగు ముందుగానే ఉంది. అలాగే, ఆర్థిక వ్యవస్థ కూడా బాగా పటిష్టంగానే ఉన్నట్టు ఐక్యరాజ్య సమితి తాజా నివేదిక కూడా తేల్చింది. దీంతో అయితే, లాక్‌డౌన్ తర్వాత చాలా మంది నిరుద్యోగులు అయ్యే అవకాశాలు ఉన్నాయనీ, ఇతర దేశాలతో పోల్చుకుంటే ఈ సంఖ్య తక్కువగా ఉంటుందని పలువురు అభిప్రాయడుతున్నారు.