శుక్రవారం, 29 మార్చి 2024
  1. వార్తలు
  2. బిజినెస్
  3. వార్తలు
Written By సెల్వి
Last Updated : శుక్రవారం, 25 సెప్టెంబరు 2020 (11:43 IST)

ఎస్‌బీఐ తన కస్టమర్లకు గుడ్ న్యూస్- రెండేళ్ల పాటు లోన్ ఈఎంఐ కట్టక్కర్లేదు..

ఎస్‌బీఐ తన కస్టమర్లకు గుడ్ న్యూస్ చెప్పింది. లోన్ రిస్ట్రక్చరింగ్‌లో భాగంగా మరో రెండేళ్ల పాటు లోన్ ఈఎంఐ కట్టక్కర్లేదని తెలిపింది. ఇది ఎస్‌బీఐ క్రెడిట్ కార్డు వాడుతున్న వారికి కూడా వర్తిస్తుందని తెలిపింది.

ఎస్‌బీఐ క్రెడిట్ కార్డు ఉపయోగిస్తూ ఉంటే.. రెండేళ్ల పాటు బిల్లు మొత్తాన్ని చెల్లించాల్సిన అవసరం ఉండదన్నారు. దీని కోసం క్రెడిట్ కార్డు ఔట్‌స్టాండింగ్ మొత్తాన్ని రిస్ట్రక్చరింగ్ చేసుకొని లోన్‌గా మార్చుకోవాలని ఎస్‌బీఐ తెలిపింది. ఈ లోన్‌పై ఈఎంఐని రెండేళ్లపాటు కట్టక్కర్లేదు. ఆ తర్వాత నుంచి ఈఎంఐ ప్రారంభమౌతుందని ఎస్బీఐ తెలిపింది. 
 
ఇక కష్టకాలంలో ఇది కస్టమర్లకు ఊరట కలిగే అంశమని చెప్పుకోవచ్చు. అయితే దీనికి కొన్ని రూల్స్ ఉన్నాయని తెలిపారు. మార్చి 1కి ముందు నెల రోజుల కన్నా ఎక్కువగా డిఫాల్ట్ అయ్యి ఉండకూడదు. మార్చి 1 నుంచి అకౌంట్లు ఎన్‌పీఏలుగా మారకూడదు. మార్చి 1 నుంచి ఆగస్ట్ 31లోపు మారటోరియం ప్రయోజనం కలిగి ఉండాలి. లేదంటే ఈ మధ్యకాలంలో కనీసం ఒక్కసారైనా మినిమమ్ బ్యాలెన్స్ కూడా చెల్లించకుండా ఉండాలి.
 
అంతేకాదు ఎస్‌బీఐ కార్డు లోన్ మారటోరియం అర్హత కలిగిన అకౌంట్ల వివరాలను రెడీ చేస్తోంది. ఇకపోతే క్రెడిట్ కార్డు కలిగిన వారు లోన్ మారటోరియం పొందాలని భావిస్తే డిసెంబర్ 31లోపు అప్లై చేసుకోవాలి. అయితే ఇక్కడ ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి. క్రెడిట్ కార్డుపై లోన్ మారటోరియం బెనిఫిట్ పొందితే.. అప్పుడు బ్యాంక్ మీ కార్డును డీయాక్టివేట్ చేస్తుంది. ఈఎంఐ డబ్బులు 3 నుంచి 6 నెలలు కట్టిన తర్వాత మళ్లీ మీ కార్డు పనిచేస్తుందని బ్యాంకు అధికారులు తెలిపారు.