1. వార్తలు
  2. బిజినెస్
  3. వార్తలు
Written By ఠాగూర్
Last Updated : మంగళవారం, 15 సెప్టెంబరు 2020 (13:56 IST)

మహారాష్ట్ర ఉల్లి రైతుల ఆందోళన.. ఎందుకో తెలుసా?

మహారాష్ట్ర ఉల్లి రైతులు ఆందోళనకు దిగారు. ఎందుకంటే.. ఉల్లి ఎగుమతులపై కేంద్రం నిషేధం విధించింది. ఇది తక్షణమే అమల్లోకి వస్తుందని పేర్కొంది. దీంతో ఉల్లి రైతులు ఆందోళనకు దిగారు. ప్రస్తుతం ఉల్లి పంట మార్కెట్‌లోకి భారీగా వస్తున్నదని నాసిక్ రైతులు చెప్పారు. ఎగుమతులపై తక్షణం నిషేధం విధించడం వల్ల ఉల్లిని ఎక్కడ నిల్వ చేయాలి, ఎక్కడ అమ్ముకోవాలని వారు ప్రశ్నించారు. 
 
ప్రస్తుతం కిలో ఉల్లి రూ.20-25కు అమ్ముడుపోతున్నదని, ఎగుమతులపై నిషేధం వల్ల ఈ ధర రూ.2-3కు పడిపోతుందని వాపోయారు. ఉల్లిని పండించే తమ లాంటి రైతులు బాగా నష్టపోతారని ఆవేదన వ్యక్తం చేశారు. ఎగుమతులపై నిషేధం వల్ల దళారులు లబ్ధిపొందుతారని ఆరోపించారు. 
 
వారు తక్కువ ధరకు భారీగా ఉల్లిని కొని ఆ తర్వాత ఎక్కువ ధరకు అమ్ముకుంటారని చెప్పారు. ఎగుమతులపై నిషేధం విధించిన కేంద్ర ప్రభుత్వం నిర్ణయం వల్ల ఉల్లి రైతులకు నష్టం, దళారులకు లాభం చేకూరుతుందని నాసిక్ ఉల్లి రైతులు విమర్శించారు.
 
దక్షిణాది రాష్ట్రాల్లో అధిక వర్షపాతం కారణంగా ఉల్లిపంటలు దెబ్బతిని రేట్లు అమాంతం పెరిగిన నేపథ్యంలో కేంద్రం ఉల్లి ఎగుమతులపై నిషేధం విధించింది. నెల రోజుల వ్యవధిలోనే ధరలు మూడింతలు పెరిగాయి. దీంతో స్పందించిన కేంద్రం అన్ని రకాల ఉల్లి ఎగుమతులపై నిషేధం విధిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. నిషేధం తక్షణం అమల్లోకి వస్తుందని పేర్కొంది. ఈ మేరకు విదేశీ వాణిజ్య డైరెక్టర్ జనరల్ (డీజీఎఫ్‌టీ) ఆఫీసు నోటిఫికేషన్ విడుదల చేసింది.
 
దక్షిణాసియాలో చాలా దేశాలు ముఖ్యంగా బంగ్లాదేశ్, నేపాల్, మలేషియా, శ్రీలంక వంటి దేశాలు ఉల్లి కోసం భారత్‌పైనే ఆధారపడతాయి. ఇక దేశంలోనే అతిపెద్ద ఉల్లిపాయల మార్కెట్ అయిన లాసల్‌గావ్‌లో నెల రోజుల వ్యవధిలో టన్ను ఉల్లిపాయల ధర మూడు రెట్లు పెరిగి ప్రస్తుతం రూ.30 వేలుగా ఉంది. ఢిల్లీలో కిలో ఉల్లి ధర రూ.40 పలుకుతోంది. ఈ నేపథ్యంలోనే దేశంలో ఉల్లి లభ్యతను పెంచేందుకు ప్రభుత్వం ఈ చర్యలు తీసుకుంది.