బుధవారం, 24 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. బిజినెస్
  3. వార్తలు
Written By సెల్వి
Last Updated : సోమవారం, 2 నవంబరు 2020 (17:06 IST)

ఐసీఐసీఐ బ్యాంక్ ఛార్జీల మోత.. ఏటీఎం మెషీన్‌లో డబ్బులు డిపాజిట్ చేస్తే..?

ప్రైవేట్ రంగ ప్రముఖ బ్యాంక్ ఐసీఐసీఐ బ్యాంక్ తాజాగా తన కస్టమర్లకు షాకిచ్చింది. బ్యాంక్ కస్టమర్ల నుంచి కొత్త చార్జీలు వసూలు చేస్తోంది. కన్వీనియన్స్ ఫీజు కింద కస్టమర్ల నుంచి రూ.50 తీసుకుంటోంది. అయితే ఏటీఎంలో డబ్బులు డిపాజిట్ చేసే వారికే ఇది వర్తిస్తుంది. 
 
బ్యాంక్ సెలవులు, బ్యాంక్ టైమింగ్స్ అయిపోయిన తర్వాత ఏటీఎం మెషీన్‌కు వెళ్లి డబ్బులు డిపాజిట్ చేస్తు కన్వీనియన్స్ ఫీజు కింద రూ.50 మీ అకౌంట్ నుంచి బ్యాంక్ కట్ చేసుకుంటుంది. ప్రతి లావాదేవీకి ఈ చార్జీలు వర్తిస్తాయి. అంటే మీరు రెండు సార్లు ఏటీఎం మెషీన్‌లో డబ్బులు డిపాజిట్ చేస్తే.. రూ.100 చెల్లించుకోవాలి. ఏటీఎం మెషీన్‌లో క్యాష్ డిపాజిట్‌కు సంబంధించి ఒక్కో లావాదేవీకి కన్వీనియన్స్ ఫీజు కింద రూ.50 వసూలు చేస్తామని ఐసీఐసీఐ బ్యాంక్ తెలిపింది. 
 
నవంబర్ 1 నుంచి ఈ కొత్త చార్జీల విధింపు అమలులోకి వచ్చిందని పేర్కొంది. అంతేకాకుండా క్యాష్ యాక్సెప్టర్, రిసైక్లర్ మెషీన్లలో నెలకు రూ.10,000కు పైగా డబ్బులు డిపాజిట్ చేయాలని భావించినా కూడా కన్వీనియన్స్ చార్జీలు పడతాయి. 
 
అయితే ఐసీఐసీఐ బ్యాంక్ మాత్రం ఇక్కడ కొంత మందికి ఊరట కలిగించే నిర్ణయం తీసుకుంది. సీనియర్ సిటిజన్స్ సహా బేసిక్ సేవింగ్స్ అకౌంట్, జన్ ధన్ అకౌంట్ కలిగిన వారికి మాత్రం ఈ కన్వీనియన్స్ చార్జీలు వర్తించవు. అంటే వీరికి ఈ చార్జీలు పడవు. ఇంకా స్టూడెంట్ అకౌంట్స్, వికాలంగులకు కూడా ఈ చార్జీలు ఉండవు.