1. వార్తలు
  2. బిజినెస్
  3. వార్తలు
Written By ఠాగూర్
Last Updated : ఆదివారం, 24 అక్టోబరు 2021 (14:59 IST)

14 యేళ్ల తర్వాత రెట్టింపుకానున్న అగ్గిపెట్టె ధర

దేశంలో ప్రతి ఒక్క వస్తువు ధర పెరిగిపోతోంది. పెట్రోల్, డీజల్, వంటగ్యాస్ ధరల గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. పెట్రోల్, డీజల్ ధరల బాదుడు ఇపుడు కామన్‌గా మారిపోయింది. గత యేడాదిన్న కాలంలో పెట్రోల్ ధర ఏకంగా 36 రూపాయలు పెరిగిందంటే ఈ ధరల భారం ఏ విధంగా ఉందో ఇట్టే అర్థం చేసుకోవచ్చు. వీటితోపాటు ఉన్ని రకాల నిత్యావరవస్తు సరకుల ధరలు కూడా విపరీతంగా పెరిగిపోయాయి. 
 
ఇపుడు అగ్గిపెట్టె ధర కూడా రెట్టింపుకానుంది. తానేం తక్కువ కాదన్నట్లుగా అగ్గిపెట్టె ధర 14 యేళ్ళ తర్వాత రెట్టింపుకానుంది. ఇంతకాలం ఒక్క రూపాయికే లభించిన అగ్గిపెట్టె ధర ఇకపై 2 రూపాయలు పలకనుంది. 
 
తాజాగా అగ్గిపెట్టె తయారీదార్లకు సంబంధించిన ఐదు కీలక సంఘాలు తాజాగా తమిళనాడులోని శివకాశీలో సమావేశమై ఈ నిర్ణయం తీసుకున్నాయి. దేశంలో చివరిసారి 14 సంవత్సరాల క్రితం అంటే 2007లో అగ్గిపెట్టె ధర 50 పైసలు ఉండగా, 1 రూపాయికి చేరుకుంది. అప్పటి నుంచి ఇప్పటి వరకు 1 రూపాయి ఉన్న ధర ఇప్పుడు 2 రూపాయలకు చేరుకుంది. 
 
దీంతో ఇప్పటివరకు 600 అగ్గిపెట్టెల బాక్సును రూ.270-300కి తయారీదార్లు విక్రయిస్తుండగా, ఇక నుంచి రూ.430-480కి పెంచాలని సంఘాలు సమావేశంలో నిర్ణయించాయి. దీనికి అదనంగా 12 శాతం జీఎస్టీ, రవాణా చార్జీలు ఉంటాయని నేషనల్‌ స్మాల్‌ మ్యాచ్‌బాక్స్‌ మాన్యుఫాక్చరర్స్‌ అసోసియేషన్‌ తెలిపింది.
 
కాగా, అగ్గి పెట్టె ధర 14 ఏళ్ల తర్వాత ఇప్పుడు పెరగనుంది. ఈ ఏడాది డిసెంబరు 1 నుంచి అగ్గి పెట్టెను రూ.2 చొప్పున విక్రయిస్తామని తయారీ సంస్థల సమాఖ్య ‘ఆలిండియా ఛాంబర్ ఆఫ్ మ్యాచెస్’ ప్రకటించింది. అగ్గిపుల్లల తయారీలో వినియోగించే 14 రకాల ముడి సరుకుల ధరలు భారీగా పెరగడం కారణంగానే ధరను పెంచాల్సి వస్తోందని తెలిపింది.