1. వార్తలు
  2. బిజినెస్
  3. వార్తలు
Written By ఎం
Last Updated : బుధవారం, 25 డిశెంబరు 2019 (17:10 IST)

ఈ ఏడాది అంబానీ సంపద ఎంతో తెలుసా?

భారత అపరకుబేరుడు, ఆసియా సంపన్నుడు ముఖేశ్‌ అంబానీ సంపద 2019లో ఎంత పెరిగిందో తెలుసా? అక్షరాలా17 బిలియన్‌ డాలర్లు. అంటే భారత కరెన్సీలో దాదాపు రూ. 1.2లక్షల కోట్లు. దీంతో డిసెంబరు 23 నాటికి అంబానీ మొత్తం సంపద 61 బిలియన్‌ డాలర్లకు(దాదాపు రూ. 4.3లక్షల కోట్లు) పెరిగినట్లు బ్లూమ్‌బర్గ్‌ బిలియనీర్స్ ఇండెక్స్‌ పేర్కొంది. 
 
ఇక ప్రపంచ కుబేరుల్లో ఒకరైన అలీబాబా గ్రూప్‌ వ్యవస్థాపకుడు జాక్‌ మా సంపద ఈ ఏడాది 11.3 బిలియన్‌ డాలర్లు పెరగగా.. అమెజాన్‌ అధినేత జెఫ్‌ బెజోస్‌ 13.2 బిలియన్‌ డాలర్లు కోల్పోవడం గమనార్హం.
 
ఈ ఏడాది రిలయన్స్ ఇండస్ట్రీస్‌ లిమిటెడ్‌ షేర్లు 40శాతం పెరగడంతో అంబానీ సంపద కూడా భారీగా పెరిగింది. మూడేళ్ల క్రితం రిలయన్స్ తీసుకొచ్చిన జియో.. అనతికాలంలోనే భారత్‌లో అగ్రగామి టెలికాం ఆపరేటర్‌గా ఎదిగింది. 
 
ఈ విజయం కంపెనీకి కొత్త ఉత్సాహాన్నిచ్చింది. దీంతోపాటు రిలయన్స్‌ను రుణరహిత సంస్థగా తీర్చిదిద్దేందుకు అంబానీ ప్రణాళికలు రచిస్తున్నారు. 2021 ఆరంభం నాటికి రిలయన్స్‌ గ్రూప్‌ సున్నా రుణాలతో ఉండేలా చూస్తామని ఆ మధ్య ముఖేశ్‌ అంబానీ కూడా ప్రకటించారు. 
 
ఇందులో భాగంగానే రిలయన్స్‌ ఆయిల్‌ టు కెమికల్‌ వ్యాపారంలో కొన్ని వాటాలను సౌదీ అరేబియాకు చెందిన ఆరామ్‌కోకు విక్రయించేందుకు ఒప్పందం కూడా కుదుర్చుకున్నారు. ఈ నేపథ్యంలో కంపెనీ షేర్లు రికార్డు స్థాయిలో పెరిగాయి. 2016లో జియో మార్కెట్లోకి అడుగుపెట్టిన తర్వాత నుంచి ఇప్పటివరకు రిలయన్స్‌ షేర్లు మూడింతలు పెరగడం విశేషం.