శుక్రవారం, 26 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. బిజినెస్
  3. వార్తలు
Written By
Last Updated : సోమవారం, 14 జనవరి 2019 (19:46 IST)

వ్యక్తిగత ఆదాయ పన్ను పరిమితి రూ.5 లక్షలకు పెంపు!

వేతన జీవులకు కేంద్ర ప్రభుత్వం శుభవార్త చెప్పనుంది. త్వరలోనే లోక్‌సభ ఎన్నికలు జరుగనున్నాయి. ఈ ఎన్నికల బొనాంజాగా ప్రధాని నరేంద్ర మోడీ ఓ ప్రకటన వెల్లడించనున్నట్టు వార్తలు వస్తున్నాయి. ముఖ్యంగా, వ్యక్తిగత ఆదాయ పరిమితిని రూ.5 లక్షలకు పెంచే యోచనలో ఉన్నట్టు తెలుస్తోంది. ఈ విషయంపై త్వరలో ప్రవేశపెట్టనున్న ఓటాన్ అకౌంట్ బడ్జెట్‌లో ప్రకటన చేసే అవాకాశం ఉన్నట్టు తెలుస్తోంది.
 
ప్రస్తుతం వ్యక్తిగత ఆదాయ పన్నుపరిమితి రూ.2.5 లక్షల వరకు ఉంది. అంటే 2.5 లక్షల వరకు ఆదాయంపై వ్యక్తిగత ఆదాయ పన్ను లేదు. దీన్ని ఇపుడు ఏకంగా రూ.5 లక్షలకు పెంచాలని ప్రధాని మోడీ భావిస్తున్నట్టు తెలుస్తోంది. ఇటీవల ఇండస్ట్రీ ఛాంబర్ సీఐఐ కూడా ఆదాయపన్ను మినహాయింపు పరిమితిని రెట్టింపు చేసి రూ.5 లక్షలు చేయాలని కోరింది. 
 
అదేవిధంగా పొదుపులను ప్రోత్సహించేందుకు ఫిబ్రవరి ఒకటో తేదీన ప్రవేశపెట్టే కేంద్ర బడ్జెట్‌లో సెక్షన్ 80సి కింద తగ్గింపు పరిమితిని రూ.2.50 లక్షలకు పెంచాలని కోరింది. ఆర్థిక మంత్రిత్వశాఖకు బడ్జెట్ ముందు ఇచ్చే సలహాల్లో భాగంగా సీఐఐ, అత్యధిక వ్యక్తిగత ఆదాయ పరిమితిని 30 శాతం నుంచి 25 శాతం చేయాలని సూచించింది. 
 
వైద్య ఖర్చులు, రవాణా భత్యాలపై మినహాయింపు ఇవ్వాలని చెప్పింది. రూ.5-10 లక్షల ఆదాయంపై 10 శాతం, రూ.10-20 లక్షల ఆదాయంపై 20 శాతం, రూ.20 లక్షల పైబడిన ఆదాయంపై 25 శాతం పన్ను విధించాలని సిఫార్సు చేసింది. దీనికి అనుగుణంగా ప్రధాని మోడీ నిర్ణయం తీసుకునే అవకాశం ఉన్నట్టు కేంద్ర ప్రభుత్వ వర్గాల సమాచారం.