శుక్రవారం, 19 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By
Last Updated : సోమవారం, 7 జనవరి 2019 (17:02 IST)

అసూయతో మోదీ అలా మాట్లాడుతున్నారు.. ఏం చేద్దాం..?: చంద్రబాబు సెటైర్

ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిని చూసి అసూయపడుతున్నారని.. ఆ ఒత్తిడిని ఎలా బయటకు నెట్టుకోవాలో తెలియక తనపై విమర్శలు గుప్పిస్తున్నారని.. ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు అన్నారు. 


ప్రభుత్వ అధికారులు, ప్రజా ప్రతినిధులతో సోమవారం చంద్రబాబు నిర్వహించిన టెలికాన్ఫరెన్స్‌లో మోదీకి ఏపీపై వున్న అసూయను తనపై వెళ్లగక్కుతున్నారని ఫైర్ అయ్యారు.

రాష్ట్రాన్ని సూర్యుని అస్తమనంలా అంధకారంలో ముంచేయాలనుకున్న మోదీకి.. ఏపీ అభివృద్ధి సూర్యోదయం.. ఉషోదయంలా వెలిగిపోతుండటం చూసి ఓర్వలేకపోతున్నారని బాబు సెటైర్లు విసిరారు. 
 
కాగా బీజేపీ కార్యకర్తలతో మోదీ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించిన సందర్భంగా ఏపీ సీఎ చంద్రబాబుపై తీవ్రస్థాయిలో విమర్శనాస్త్రాలు సంధించారు. చంద్రబాబు కుమారుడు మంత్రి నారాలోకేష్‌కు ఉషోదయం.. ఏపీకి సూర్యాస్తమయం అన్న చందంలో అక్కడ పాలన జరుగుతుందని విమర్శించారు. నారా లోకేష్ జీవితంలో వెలుగులు నింపడం కోసం ఏపీని బాబు అంధకారంలోకి నెట్టేస్తున్నారని ఆరోపించారు. 
 
గతంలో అధికారం కోసం ఎన్టీఆర్‌కు చంద్రబాబు వెన్నుపోటు జగమెరిగిన సత్యమని.. అయితే ఎన్టీఆర్ జీవిత కాలం పోరాడిన కాంగ్రెస్‌తో కలవడం ద్వారా ఆయనకు రెండోసారి బాబు వెన్నుపోటు పొడిచారని.. మోదీ తీవ్రంగా మండిపడ్డారు. ఎన్టీఆర్‌ ''కాంగ్రెస్‌ ముక్త్‌ భారత్‌'' పోరాటం చేస్తే.. అధికారం కోసం కాంగ్రెస్ ముందు బాబు శిరస్సు వంచారని విమర్శించారు. తద్వారా తెలుగువారి ఆత్మగౌరవాన్ని మంటగలిపారని ఫైర్ అయ్యారు.