ఫిబ్రవరి నెలలో తగ్గిన భోజన ఖర్చులు - ఎందుకో తెలుసా?
ఈ యేడాది ఫిబ్రవరి నెలలో దేశ ప్రజల భోజన ఖర్చులు తగ్గాయి. ఈ మేరకు దేశీయ రేటింగ్ ఏజెన్సీ క్రిసిల్ ఓ నివేదికను వెల్లడించింది. కూరగాయలు, బ్రాయిలర్ కోడిమాంసం ధరలు తగ్గడంతో శాఖాహార, మాంసాహార భోజన తయారీ ఖర్చులు 5 శాతం తగ్గినట్టు పేర్కొంది. దిగుబడి పెరిగి కూరగాయలు ధరలు తగ్గడంతో శాఖాహారం, బర్డ్ ఫ్లూ భయం వల్ల చికెన్ ధరలు తగ్గాయని, ఈ ప్రభావం కారణంగా భోజన వ్యయం కూడా తగ్గినట్టు పేర్కొంది. ఈ మేరకు నెలవారీ రోటీ రైస్ రేట్ నివేదికలో క్రిసిల్ పేర్కొంది.
ఇక వార్షిక పద్దతిన చూస్తే ఇంట్లో వండిన శాఖాహార భోజన వ్యయం ఒక శాతం తగ్గగా, మాంసాహార భోజన వ్యయం 6 శాతం పెరిగింది. టమాటా, వంట గ్యాస్ ధరలు తగ్గడంతో గత యేడాది ఫిబ్రవరితో పోలిస్తే ఈ ఫిబ్రవరిలో శాఖాహార భోజన ధరలు తగ్గాయి. కిలో టమోటా గత యేడాది ఫిబ్రవరిలో రూ.32గా ఉంటే, ఈ సారి అదే నెలలో 28 శాతం తగ్గి రూ.23కు చేరిందని తెలిపింది. టమాటా దిగుబడి 20 శాతం మేరకు పెరగడమే ఇందుకు కారణమని వెల్లడించింది.
అలాగే, గత యేడాదితో పోలిస్తే బ్రాయిలర్ ధరలు 15 శాతం పెరగడంతో మాంసాహార భోజనం ఖరీదు అయింది. మాంసాహార భోజనంలో 50 శాతం ఖర్చు బ్రాయిలర్దే. గత యేడాది బ్రాయిలర్ ధరలు తగ్గగా, ఈ సారి కోళ్ల దాణా వ్యయాలు పెరగడంతో బ్రాయిలర్ చికెన్ ధర పెరిగింది. ఇక జనవరి నెలతో పోలిస్తే ఫిబ్రవరిలో ఉల్లి 7 శాతం, బంగాళాదంప 17 శాతం, టమాటా 25 శాతం, బ్రాయిలర్ 5 శాతం మేరకు ధరలు తగ్గాయి.