1. వార్తలు
  2. బిజినెస్
  3. వార్తలు
Written By ఠాగూర్
Last Updated : గురువారం, 24 జూన్ 2021 (16:09 IST)

రిలయన్స్ ఏజీఎం భేటీ : సరికొత్త స్మార్ట్ ఫోన్... జియో ఇనిస్టిట్యూట్

రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ (ఆర్ఐఎల్) 44వ వార్షిక సర్వసభ్య సమావేశం గురువారం మధ్యాహ్నం ముంబైలో ప్రారంభమైంది. ఈ సమావేశంలో రిలయన్స్ జియో కొత్తగా ఓ స్మార్ట్ ఫోనును తీసుకుని రానుంది. అలాగే, నవీ ముంబైలో జియో ఇనిస్టిట్యూట్‌ను నెలకొల్పనుంది. కాగా, ఈ ఏజీఎం భేటీలో రిలయన్స్ ఫౌండేషన్ వ్యవస్థాపకురాలు, చైర్ పర్సన్ హోదాలో నీతా అంబానీ కూడా పాల్గొన్నారు. 
 
ఇందులో ఆమె మాట్లాడుతూ, ముంబైలో జియో ఇనిస్టిట్యూట్‌ను నెలకొల్పనున్నట్టు తెలిపారు. నవీ ముంబైలో దీన్ని నెలకొల్పుతామన్నారు. కరోనా మహమ్మారి విజృంభిస్తున్నప్పటికీ, ఈ విద్యాసంవత్సరం నుంచే జియో ఇనిస్టిట్యూట్ కార్యకలాపాలు ప్రారంభం అవుతాయన్నారు. 
 
జీవితకాల శిక్షణ, అత్యున్నత ఆవిష్కరణలకు జియో ఇనిస్టిట్యూట్ ఓ ప్రపంచస్థాయి వేదికగా నిలుస్తుందన్న ఆశాభావాన్ని ఆమె వ్యక్తం చేశారు. ఈ సంస్థ ద్వారా విద్యార్థులకు ఉపకారవేతనాలు కూడా అందజేస్తామన్నారు. 
 
దేశవ్యాప్తంగా 21 వేల మంది పిల్లలకు క్రీడల్లో శిక్షణకు ఏర్పాట్లు చేశామని తెలిపారు. మహిళలు, బాలికల సాధికారతకు కృషి చేస్తామని వివరించారు. ముఖ్యంగా, గ్రామీణ మహిళల ఆర్థికాభివృద్ధికి పలు కార్యక్రమాలు చేపడుతున్నట్టు పేర్కొన్నారు.
 
అంతేకాదు, కొవిడ్‌తో పోరాటానికి తమ రిలయన్స్ ఫౌండేషన్ 5 కార్యాచరణలు ప్రారంభించిందని నీతా అంబానీ వెల్లడించారు. మిషన్ ఆక్సిజన్, మిషన్ కొవిడ్ ఇన్ ఫ్రా, మిషన్ అన్న సేవ, మిషన్ ఎంప్లాయీ కేర్, మిషన్ వ్యాక్సిన్ సురక్ష పేరిట ఈ ఐదు మిషన్లు కొనసాగుతాయని వివరించారు.