మంగళవారం, 23 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. బిజినెస్
  3. వార్తలు
Written By సెల్వి
Last Updated : శనివారం, 9 మే 2020 (16:52 IST)

ఎస్‌బీఐకి కుచ్చుటోపీ.. రూ.414 కోట్ల ఎగనామం..!

బ్యాంకులను మోసం చేసి ఆపై కుచ్చుటోపీలు పెట్టే వ్యక్తుల సంఖ్య పెరిగిపోతోంది. ఇప్పటికే పలు స్కామ్‌లు, భారీ రుణ ఎగవేతలతో కుదేలవుతున్న బ్యాంకింగ్ వ్యవస్థలో మరో ఉదంతం వెలుగుచూసింది. ఢిల్లీ కేంద్రంగా బాస్మతి బియ్యం ఎగుమతి కార్యకలాపాలు నిర్వహించే రామ్‌దేవ్ అంతర్జాతీయ సంస్థ ఎస్‌బీఐతో పాటు మొత్తం ఆరు బ్యాంకులకు రూ.414కోట్లు కుచ్చుటోపీ పెట్టింది. ఈ సంస్థను డిఫాల్టర్ల జాబితాలో చేర్చిన నాలుగేళ్ల తర్వాత ఎస్‌బీఐ సీబీఐకి ఫిర్యాదు చేసింది. 
 
ఇంతలో జరగాల్సిందంతా జరిగిపోయింది. ఇప్పటికే ఆ సంస్థ డైరెక్టర్లు నరేశ్‌ కుమార్‌, సురేశ్‌ కుమార్‌, సంగీత విదేశాలకు చెక్కేసినట్టు తెలుస్తోంది. ఎస్‌బీఐ ఫిర్యాదు మేరకు సీబీఐ వారిపై ఫోర్జరీ, చీటింగ్‌ కేసులను నమోదు చేసి విచారణ కొనసాగిస్తోంది. 
 
తీసుకున్న రుణాలు చెల్లించకపోవడంతో రామ్ దేవ్ ఇంటర్నేషనల్ సంస్థను జనవరి 7, 2016లోనే ఎస్‌బీఐ మొండి బకాయిల జాబితాలో చేర్చింది. అప్పటినుంచి ఇప్పటివరకూ వారి ఆచూకీ లేదు. నాలుగేళ్ల తర్వాత ఎస్‌బీఐ ఈ ఏడాది ఫిబ్రవరి 25న ఆ సంస్థపై సీబీఐకి ఫిర్యాదు చేయగా.. ఏప్రిల్ 28న కేసు నమోదైంది.
 
రామ్‌దేవ్ ఇంటర్నేషనల్స్ ఎస్‌బీఐ నుండి రూ.173.11 కోట్లు, కెనరా బ్యాంకు నుంచి రూ.76.09 కోట్లు, యూనియన్‌ బ్యాంకు నుండి రూ.64.31 కోట్లు సెంట్రల్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా నుండి రూ.51.31 కోట్లు, కార్పొరేషన్‌ బ్యాంకు నుండి రూ. 36.91 కోట్లు, ఐడిబిఐ బ్యాంకు నుండి రూ.12.27 కోట్లు తీసుకుని రుణ ఎగవేతకు పాల్పడింది.