శనివారం, 27 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. కెరీర్
  3. అవకాశాలు
Written By ఐవీఆర్
Last Modified: గురువారం, 18 ఆగస్టు 2022 (22:46 IST)

ఏడవ ఎడిషన్‌ సంతూర్‌ స్కాలర్‌షిప్‌ ప్రోగ్రామ్‌ 2022-23ను ప్రకటించిన విప్రో కన్స్యూమర్‌ కేర్‌

school students
విప్రో కేర్స్‌తో కలిసి విప్రో కన్స్యూమర్‌ కేర్‌ తమ ఏడవ ఎడిషన్‌ సంతూర్‌ ఉమెన్స్‌ స్కాలర్‌షిప్‌ కార్యక్రమాన్ని కర్నాటక, ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణా రాష్ట్రాలలో ప్రారంభించింది. మొట్టమొదటిసారిగా ఈ స్కాలర్‌షిప్‌‌ను ఛత్తీస్‌ఘడ్‌లో సైతం ప్రారంభించనున్నారు. ఉన్నత విద్యనభ్యసించాలనే కోరిక ఉన్నప్పటికీ ఆర్ధికంగా వెనుకబడిన వర్గాలకు చెందిన ప్రతిభావంతులైన బాలికలకు తగిన మద్దతునందించడంలో భాగంగా ఈ స్కాలర్‌షిప్‌లను అందిస్తున్నారు.

 
ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణా, కర్నాటక రాష్ట్రాలలో 10వ తరగతి నుంచి 12వ తరగతి వరకూ ప్రభుత్వ పాఠశాలలు/కాలేజీలలో విద్యనభ్యసించిన విద్యార్ధులు ఈ స్కాలర్‌షిప్‌లను అందుకోవడానికి అర్హులు. వీరు గుర్తించబడిన సంస్థ అందించే కోర్సులలో కనీసం మూడు సంవత్సరాల వ్యవధి కలిగిన డిగ్రీ కార్యక్రమంలో చేరి ఉండాలి.

 
ఈ కార్యక్రమం గురించి విప్రో కన్స్యూమర్‌ కేర్‌ అండ్‌ లైటింగ్‌, వైస్‌ ప్రెసిడెంట్‌-మార్కెటింగ్‌, శ్రీ ఎస్‌ ప్రసన్న రాజ్‌ మాట్లాడుతూ, ‘‘ఈ సంవత్సరం మేము నాలుగు రాష్ట్రాల్లోనూ కలిపి 1800 మంది విద్యార్ధులకు స్కాలర్‌షిప్‌లను అందించనున్నాము. మేము ఈసారి తెలంగాణా, ఆంధ్రప్రదేశ్‌, కర్నాటక రాష్ట్రాలలో ఉన్న ఒక్కో రాష్ట్రానికి 300 స్కాలర్‌షిప్‌ల సంఖ్యను ఇప్పుడు రాష్ట్రానికి 500 స్కాలర్‌షిప్‌ల చొప్పున పెంచాము. మొట్టమొదటిసారిగా ఛత్తీస్‌ఘడ్‌లో ఈసారి 300 స్కాలర్‌షిప్‌లను అందించబోతున్నాము. గత ఆరు సంవత్సరాలలో అర్హతకలిగిన 4500 మంది బాలికలకు తమ గ్రాడ్యుయేషన్‌ పూర్తి చేయడంలో సహాయపడ్డాము’’ అని అన్నారు.

 
ఈ స్కాలర్‌షిప్‌ల కోసం దరఖాస్తులు ఆగస్టు 18 నుంచి సెప్టెంబర్‌ 18, 2022 వరకూ తెరిచి ఉంటాయి. విద్యార్ధులు ఆన్‌లైన్‌లో santoorscholarships.com వద్ద దరఖాస్తు చేయాల్సి ఉంటుంది. సామాజిక మార్పుకు అత్యంత కీలకమైన తోడ్పాటుదారునిగా విద్య నిలుస్తుందని విప్రో కన్స్యూమర్‌ కేర్‌ నమ్ముతుంది. దరఖాస్తులు అందుబాటులో ఉండే తేదీలు ఆగస్టు 18 నుంచి సెప్టెంబర్‌ 18, 2022. దరఖాస్తులు చేరాల్సిన చివరి తేదీ 18 సెప్టెంబర్‌ 2022.