1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. కరోనా
Written By ఠాగూర్
Last Updated : గురువారం, 2 సెప్టెంబరు 2021 (13:13 IST)

దేశంలో కరోనా థర్డ్ వేవ్ ఛాన్సెస్ తక్కువే : రణదీప్ గులేరియా

దేశంలో కరోనా మూడో దశ వ్యాప్తి అవకాశాలు చాలా తక్కువగా ఉన్నాయని ఎయిమ్స్ చీఫ్ రణదీప్ గులేరియా అభిప్రాయపడ్డారు. ఇదే అంశంపై ఆయన మాట్లాడుతూ, రాబోయే నెలల్లో కొవిడ్‌ కేసులు కాస్త పెరిగే అవకాశం ఉందని, కానీ, థర్డ్‌ వేవ్‌ వచ్చే అవకాశాలు తక్కువగానే ఉన్నాయన్నారు. 
 
‘థర్డ్‌ వేవ్‌లో చిన్నారులపై ప్రభావం’పై ఆయనను ప్రశ్నించగా.. టీకాలు వేయకపోవడంతో చాలా మందికి ఇన్ఫెక్షన్‌ సోకే అవకాశం ఉందని నమ్ముతున్నట్లు తెలిపారు. అయినా పిల్లలు కరోనా బారినపడినా తేలికపాటి లక్షణాలుంటాయని, తీవ్రమైన ఇన్ఫెక్షన్‌ ఉండదని ప్రపంచ డేటా చూపిస్తోందన్నారు. 
 
అలాగే, పాఠశాలల పునఃప్రారంభమై ఆయన స్పందిస్తూ, వైరస్‌ సానుకూలత రేటు తక్కువ ఉన్న ప్రాంతాలు, కొవిడ్‌ నిబంధనలు అనుసరిస్తున్న ప్రాంతాల్లో తిరిగి ప్రత్యక్ష తరగతులు ప్రారంభించవచ్చన్నారు. అయితే, కఠిన పర్యవేక్షణ ఉండాలని స్పష్టం చేశారు. 
 
కేసులు మళ్లీ పెరగడం ప్రారంభమైతే వెంటనే వాటిని మూసివేయాలన్నారు. కేసులు తక్కువగా ఉన్న సమయంలో పాఠశాలలు తెరవడంతో ‘రిస్క్‌-బెనిఫిట్‌అనాలిసిస్‌’పై అధ్యయనం చేసే అవకాశం లభిస్తుందన్నారు. విద్యార్థులకు భౌతిక తరగతులు చాలా ముఖ్యమైనవన్నారు.