శుక్రవారం, 26 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. కరోనా
Written By ఠాగూర్
Last Updated : మంగళవారం, 20 ఏప్రియల్ 2021 (15:27 IST)

44 లక్షల కరోనా డోసులు వృథా : పది రోజుల్లో స్పుత్నిన్

దేశంలోని పలు రాష్ట్రాల్లో కరోనా టీకాల కొరత వేధిస్తోంది. మరికొన్ని రాష్ట్రాల్లో ఈ టీకాలను వృథా చేస్తున్నారు.  ఈ వృథా ఎక్కువ స్థాయిలో ఉండటం ఆందోళన కలిగిస్తోంది. ఏప్రిల్‌ 11 వరకు రాష్ట్రాలకు ఇచ్చిన మొత్తం వ్యాక్సిన్లలో 23శాతం డోసులు వృథా అయినట్లు ఆర్‌టీఐ దరఖాస్తు ద్వారా వెల్లడైంది. ఈ టీకాలను అత్యధిగా వృథా చేసిన రాష్ట్రంలో తమిళనాడు నిలిచింది. ఏప్రిల్‌ 11 నాటికి రాష్ట్రాలన్నింటికీ 10 కోట్ల డోసుల టీకాలను కేటాయించగా.. ఇందులో 44లక్షలకు పైగా డోసులు వృథా అయినట్లు వెల్లడైంది. 
 
వీటిలో తమిళనాడులో 12.10శాతం, హరియాణాలో 9.74శాతం, పంజాబ్‌లో 8.12శాతం, మణిపూర్‌లో 7.8శాతం, తెలంగాణలో 7.55శాతం డోసులు నిరుపయోగమైనట్లు సహచట్టం దరఖాస్తుకు ఇచ్చిన సమాధానంలో సంబంధిత అధికారులు పేర్కొన్నారు. ఇక కేరళ, పశ్చిమ బెంగాల్‌, హిమాచల్‌ ప్రదేశ్‌, మిజోరం, గోవా, డామన్‌ డయ్యూ, అండమాన్‌ నికోబార్‌ దీవులు, లక్షద్వీప్‌లో ఈ వృథా తక్కువగా ఉన్నట్లు తెలిపారు.
 
దేశంలో టీకా వృథాపై ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కూడా ఆందోళన వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. దీనిపై ప్రత్యేక దృష్టి సారించిన కేంద్రం.. డోసుల వృథా కట్టడికి రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని గతంలో సూచించింది. స్టాక్‌ను సకాలంలో ఉంచుకోవాలని, టీకా వినియోగానికి సంబంధించి కొవిన్‌, ఈవిన్‌ పోర్టల్‌లో ఎప్పటికప్పుడు అప్‌డేట్‌ చేయాలని సూచించింది.
 
మరోవైపు, రష్యా అభివృద్ధి చేసిన కరోనా టీకా స్పుత్నిక్‌-వి మరో 10 రోజుల్లో భారత్‌లోకి రానుంది. వచ్చే నెలలో భారత్‌లో స్పుత్నిక్‌-వి టీకా ఉత్పత్తిని ప్రారంభించి.. ప్రతి నెలా 50 మిలియన్ల డోసులు ఉత్పత్తి చేయనున్నట్లు రష్యాలో భారత రాయబారి బాల వెంకటేశ్‌ వర్మ వెల్లడించారు. ఈ నెల చివరిలోపు రష్యా నుంచి స్పుత్నిక్‌-వి డోసుల మొదటి దిగుమతి జరుగుతుందని.. మే నెలలో భారత్‌లో ఉత్పత్తి ప్రారంభించి క్రమంగా పెంచనున్నట్లు ఆయన వెల్లడించారు.
 
రష్యా అభివృద్ధి చేసిన స్పుత్నిన్‌-వి టీకా అత్యవసర వినియోగానికి భారత ఔషధ నియంత్రణ సంస్థ (డీసీజీఐ) కొద్ది రోజుల క్రితమే అనుమతించింది. డీసీజీఐ అనుమతితో వ్యాక్సిన్‌ దిగుమతికి మార్గం సుగుమమైనట్లు భారత్‌లో స్పుత్నిక్‌ టీకా క్లినికల్‌ ట్రయల్స్‌ నిర్వహిస్తోన్న డాక్టర్‌ రెడ్డీస్‌ సంస్థ వెల్లడించింది.
 
రష్యన్‌ డైరెక్టర్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ ఫండ్‌ (ఆర్‌డీఐఎఫ్‌) సహకారంతో గమలేయా ఇన్‌స్టిట్యూట్‌ తయారు చేస్తున్న స్పుత్నిక్ టీకాను భారత్‌తో ఉత్పత్తి, పంపిణీ చేసేందుకు గతేడాది సెప్టెంబర్‌లోనే రెడ్డీస్‌ సంస్థతో ఒప్పందం కుదిరింది. అనంతరం రెండు, మూడు దశల్లో క్లినికల్‌ ట్రయల్స్‌ నిర్వహించిన రెడ్డీస్‌ డీసీజీఐకి దరఖాస్తు చేసింది. వాటి ఫలితాల సమాచారాన్ని విశ్లేషించిన నిపుణుల కమిటీ భారత్‌లో స్పుత్నిక్‌-వి టీకా అత్యవసర వినియోగానికి పచ్చజెండా ఊపింది.