1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. కరోనా
Written By ఠాగూర్
Last Updated : శుక్రవారం, 1 జనవరి 2021 (16:55 IST)

పెరుగుతున్న స్ట్రెయిన్ కేసులు : వణుకుతున్న భారతం

దేశంలో కరోనా వైరస్ స్ట్రెయిన్ కేసులు పెరిగిపోతున్నాయి. దీంతో దేశ ప్రజలు భయంతో వణికిపోతున్నారు. ఇప్పటికే కరోనా వైరస్ దెబ్బకు విలవిల్లాడిపోయిన ప్రజలు.. ఇపుడు కొత్తగా కరోనా స్ట్రెయిన్ రూపంలో సరికొత్త భయం పట్టుకుంది. పైగా, ఈ వైరస్ దేశంలో క్రమంగా ప్రభావం చూపుతోంది. 
 
తాజాగా దేశంలో కొత్తగా మరో నాలుగు స్ట్రెయిన్ కేసులు నమోదయినట్లు కేంద్ర వైద్యఆరోగ్య శాఖ ప్రకటించింది. దీంతో.. భారత్‌లో మొత్తం స్ట్రెయిన్ కేసుల సంఖ్య 29కి చేరింది. గడచిన మూడు రోజుల వ్యవధిలో 25 మందికి స్ట్రెయిన్ వైరస్ పాజిటివ్‌గా నిర్ధారణ కావడం గమనార్హం. 
 
మొత్తం స్ట్రెయిన్ కేసుల్లో న్యూఢిల్లీలో 10, పశ్చిమ బెంగాల్‌లోని ఎన్‌ఐబీఎంజీ కల్యాణిలో 1, పుణెలో 5, హైదరాబాద్‌లో మూడు, బెంగళూరులో 10 కేసులు నమోదయినట్లు కేంద్రం ప్రకటించింది. యూకేలో కలకలం రేపుతున్న ఈ స్ట్రెయిన్ వైరస్ పలు ప్రపంచ దేశాల్లో ప్రభావం చూపుతోంది.
 
ఇకపోతే, యూకేతో పాటు భారత్, డెన్మార్క్, నెదర్లాండ్స్, ఆస్ట్రేలియా, ఇటలీ, స్వీడన్, ఫ్రాన్స్, స్పెయిన్, స్విట్జర్లాండ్, జర్మనీ, కెనడా, జపాన్, లెబనాన్, సింగపూర్ దేశాల్లో స్ట్రెయిన్ కేసులు నమోదవడం గమనార్హం. 
 
స్ట్రెయిన్ నేపథ్యంలో ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా యూకే నుంచి ప్రయాణాలపై భారత్‌తో పాటు ప్రపంచవ్యాప్తంగా దాదాపు 40 దేశాలు నిషేధం విధించాయి. యూకేలో సెప్టెంబర్ 21న కొత్త కరోనా స్ట్రెయిన్ వైరస్ తొలి కేసు వెలుగుచూసింది.